ప్రముఖ ఛానల్ సర్వే.. ఏపీలో టీడీపీదే అధికారం

 

ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మధ్య ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లు సాగేలా కనిపిస్తోంది. అయితే కొన్ని సర్వేలు మాత్రం రాబోయే ఎన్నికల్లో కూడా గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని చెప్తున్నాయి. తాజాగా తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 5 జరిపిన సర్వేలో కూడా అదే తేలింది. ఏపీలో మొత్తం 175 స్థానాలకు గాను.. టీడీపీ 95 నుంచి 115 స్థానాలు గెలుచుకొని అధికారం నిలబెట్టుకుంటుందని తేల్చింది. వైసీపీ 55 నుంచి 75 స్థానాలు గెలుచుకొని మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమవుతుందని తెలిపింది. ఇతరులు 2 నుంచి 4 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేసింది.

గతంలో తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీ 5 నిర్వహించిన సర్వే నిజం కావడంతో.. ఇప్పుడు ఏపీలో కూడా ఈ సర్వేపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 85 నుంచి 95 స్థానాలు గెలుచుకొని అధికారం నిలబెట్టుకుంటుందని టీవీ 5 సర్వే అంచనా వేసింది. ఆ అంచనాలను నిజం చేస్తూ టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకొని అధికారం నిలబెట్టుకుంది.