బాలకృష్ణపై పోటీ చేయనున్న ప్రముఖ యాంకర్

 

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు,ఆయన కుమారుడు హరికృష్ణ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సినీనటుడు, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ కి ఇంత క్రేజ్ ఉన్న నియోజకవర్గంలో ప్రత్యర్థులు పోటీ చేసి గెలవటం అంత సులువేం కాదు. అయితే ఈ నియోజకవర్గంలో బాలకృష్ణపై రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరుపున ప్రముఖ యాంకర్‌ శ్వేతా రెడ్డిని పోటీకి దించుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అంతేకాకుండా లక్ష్మీ తులసి అనే కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయికి అమలాపురం టికెట్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు కెఎ.పాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్బంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజాశాంతి పార్టీలో కులం, మతం, ప్రాంతాల ఆధారంగా విభేదాలు లేవన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, యాదవ్‌, రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. అవినీతి రాజకీయ నేతలను నమ్మకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. తాను కులానికి, వరకట్నం పద్ధతికి వ్యతిరేకంగా పోరాడానని తెలిపారు. తాను యువతను ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. 150 కోట్ల ముస్లింల కోసం తాను అమెరికాతో పోరాడాననీ, వాళ్లందరినీ కాపాడానని పాల్‌ చెప్పుకొచ్చారు. ప్రజాశాంతి పార్టీ కోసం ఏపీలో లో 50,000 మంది కో ఆర్డినేటర్లను నియమించుకున్నామన్నారు. ఒక్కో కో ఆర్డినేటర్‌ కనీసం వెయ్యి మందిని పార్టీలో చేర్పిస్తే ఇక ప్రజలు జగన్‌, పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబులకు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. ఈ ముగ్గురు నేతలు తనలా సంవత్సరానికి రూ.లక్ష కోట్లు బయటి నుంచి తీసుకుని రాలేరనీ, నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇవ్వలేరని అన్నారు. అదంతా తనకే సాధ్యమని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.