గులాబీ గూటికి ఎల్ రమణ! బీజేపీకి అంత సీన్ లేదట...

తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్ . రమణ, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ఖరారై పోయింది. రమణ పార్టీ మారతారని  ముందు నుంచి ఉహాగానాలు వినవస్తుండగా.. తాజాగా ఆయన నుంచి అదే సంకేతం వచ్చేసింది.  ఆదివారం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమైన రమణ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమీ ఆశించకుండా, ఎలాంటి షరతులు లేకుండా, స్వచ్చందంగానే, పార్టీ మారుతున్నానని చెప్పుకొచ్చారు. వినిటోడు వెర్రోడైతే, చెప్పెటోడు సత్య హరిచంద్రుడే అవుతాడు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో, రాజకీయ నాయకుల నోటి నుంచి నిజాలను ఆశించడమే పెద్ద తప్పు. అది మన అమాయకత్వానికి పరాకాష్ట. అందుకు రమణ మినహాయింపు కాదు. 

ఒక్క రమణ మాత్రమే కాదు, ఇంకెవరైనా దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని, పార్టీ ఫిరాయించడం అంటే అది ఒక విధంగా ఆత్మను అమ్ముకోవడమే అవుతుంది. అయితే, గొంగళిలో  తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలాంటిదో, ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుకోవడం కూడా అలాంటిదే. అయితే, ఆత్మ వంచన లేకుండా, నిజాయతీగా నిజం చెప్పి, తమ దారిన తాము వెళ్ళిపోతే,అది కొంత హుందాగా ఉంటుంది. ఇంత చర్చ, ఇంత రచ్చ అవసరం ఉండదు .   

ఇక రమణ చెప్పిన సూక్తులు వింటే, వార్నీ ... అనిపించక మానదు. మంత్రి పదవి మీదనే కాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ... ఆసలు ఏ పదవినీ తాను ఆశించలేదని, తనతోపాటు కారెక్కే కార్యకర్తలు కూడా, ఏమీ అశించవద్దని, అశించరాదని అన్నారు. అంతే కాదు ఆశించి భంగ పడేకంటే, ఏదీ అశించకుండా, పార్టీ మారిపోతే కనీసం భంగపాటు  ఉండదని  ... చక్కటి ధర్మోపన్యాసం దంచి కొట్టారు రమణ. నిజానికి ఆయన ఏమి ఆశించి పార్టీ మారుతున్నారో , ఎవరికీ తెలియదు. ఈటల రాజేందర్  కు ఉద్వాసన పలికిన నేపధ్యంలో కేసీఆర్ కేవలం తమ అవసరం కోసం రమణను పార్టీలోకి ఆహ్వానించారే తప్ప, ఈయనలోని నాయకత్వ లక్షణాలకు మురిసిపోయి పిలవలేదు. సో .. పార్టీ మారడం వలన రామణకు అధికార పార్టీ నాయుడు అన్న ట్యాగ్ తప్ప ఇంకేమి దక్కదు.   

రమణ ఏమీ అశించ నప్పుడు, ఏ ఆశలు లేనప్పుడు ఇక పార్టీ మారడం ఎందుకు ? వ్రతం చెడ్డా ఫలితం దక్కని విధంగా, పార్టీ మారినా ఫలితం దగ్గదని తెలిసినప్పుడు, ఈ క్రతువు కంగాళీ ఎందుకు? అంతే కాకుండా, తా చెడ్డ కోతి వనమంతా చరిచింది అన్నట్లు, తమతోపాటు, కార్యకర్తలను కారెక్కించడం ఎందుకు?అనే ప్రశ్నలు ఆయన అనుచరుల నుంచే వినవస్తున్నాయి. రమణ ఈ సందర్భంగా చేసిన మరో ఒకటి రెండు వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. టీఆర్ఎస్‌ పార్టీలో 70 శాతం మంది నాయకులు తనకు తెలుసని, ఎక్కువ మంది సన్నిహితులేనని రమణ చెప్పారు. అది నిజమే, కేసీఆర్ నుంచి తలసాని వరకు మంత్రి వర్గంలోనే, అరడజను మందికి పైగా, టీడీపీ నుంచి వెళ్ళిన వారే ఉన్నారు. ఒక విధంగా చూస్తే ఒకప్పటి తెలంగాణ టీడీపీనే ప్రస్తుత తెరాస. ఈ అన్నిటినీ మించి ఎల్.రమణ ఎంత చేసినా.. రాష్ట్రంలో టీడీపీ ముందుకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది పార్టీ పెద్దలు ఆలోచించవలిసిన సమస్య.