ఎలా అయితే ఏంటి? మా బంగారం మాకు చేరింది

 

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు సంబంధించిన బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌.. తిరుమలకు తీసుకు వచ్చి అప్పగించే క్రమంలో.. మధ్యలో ఎన్నికల అధికారులు పట్టుకోవడం వివాదాస్పదం అయింది. అయితే ఈ వివాదంలో టీటీడీ తప్పేమీ లేదని తెలుస్తోంది. వడ్డీ ఎక్కువ ఇవ్వలేని కారణంగా బంగారం డిపాజిట్ గడువు ముగిసిన వెంటనే బంగారాన్ని టీటీడీకి అప్పగించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్ణయించుకుంది. అందుకే 1381 కేజీల బంగారాన్ని చెన్నై నుంచి తిరుమలకు తరలిస్తుండగా.. ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అంతేకాకుండా సరైన పత్రాలు చూపించలేదన్న కారణంగా రెండు రోజులు.. వారి అధీనంలోనే బంగారం ఉంది. దీనిపై.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మన్మోహన్ సింగ్ అనే ఓ ఉన్నతాధికారితో విచారణకు ఆదేశించారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించడంపై టీటీడీ అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా దీనిపై టీటీడీ ఈవో అశోక్ కుమార్ సింఘాల్ స్పందించారు. బంగారం తీసుకు వచ్చి టీటీడీ ఖజానాకు అప్పగించే బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని ఆ బ్యాంక్ ఎలా తీసుకొస్తే టీటీడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. బంగారం తీసుకు వచ్చి ఖజానాలో జమ చేసినప్పుడు మాత్రమే.. పీఎన్‌బీ బాధ్యత తీరుతుందన్నారు. అప్పుడే టీటీడీకి బంగారం చేరినట్లని స్పష్టం చేశారు. అసలు సంబంధం లేని అంశంలో.. టీటీడీ నిర్లక్ష్యం ఎలా ఉంటుందని సింఘాల్ ప్రశ్నించారు. ఈసీ బంగారాన్ని సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని బ్యాంకు అధికారులు మాతో చెప్పారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో మాకు తెలియదు అన్నారు. బంగారాన్ని వాళ్లు ఎలా తరలిస్తారో, ఏ వాహనంలో తీసుకొస్తారో టీటీడీకి ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. మేం మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్‌ 18న రావాలని చెప్పాం. ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందజేశారు. బంగారం వచ్చేంత వరకే.. మిగిలిన విషయాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. బంగారం ఎలా వస్తే ఏంటి? బంగారం మాకు అందిందా లేదా అనేది ముఖ్యమన్నారు. కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటామన్నారు. గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైందని.. ఎస్‌బీఐలో 5387 కిలోల బంగారం ఉందన్నారు. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందని లెక్కలు చెప్పారు.