TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవాణి టికెట్ల ద్వారా ఇక ఏ రోజుకా రోజే శ్రీవారి దర్శనం

Published on: Thu Jul 31, 2025 9:21AM

తిరుమలలో శ్రీవాణి దర్శనం టికెట్లు ఇకపై ఏ రోజుకారోజు కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇప్పటి వరకూ శ్రీవాణి టికెట్లతో దర్శనం చేసుకోవడానికి మూడు రోజులు గడువు ఇచ్చేవారు. కానీ ఆగస్టు ఒకటి నుంచి ఈ విధానాన్ని మార్చి ఏ రోజు శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుంటే ఆ రోజే దర్శనేం చేసుకోవలసి ఉంటుంది. ఈ నూనత విధానాన్ని ప్రయోగాత్మకంగా ఆగస్టు 1 నుంచి 15 వరకూ అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఆ తరువాత నవంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పేర్కొంది. ఈ నూతన విధానం భక్తులకు, ప్రత్యేకించి ఆఫ్ లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లు తీసుకునే వారికి సౌకర్యంగా ఉంటుందని టీటీడీ పేర్కొంది.  శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు ఆఫ్ లైన్ లో తీసుకునే వారి దర్శన సమయాల్లో కూడా మార్పులు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌరది తెలిపారు.  

తిరుమ‌ల‌లోని గోకులం స‌మావేశ మందిరంలో ఆయ‌న శ్రీ‌వాణి దర్శ‌నాల‌పై బుధవారం (జులై 30) సమీక్ష నిర్వహించారు.  ఆ సమీక్షలో శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఈ కొత్త విధానంలో తిరుమలలో ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్ల కౌంటర్లు తెరుస్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తారు.  ఈ టికెట్లు పొందిన వారు అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచీ దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకూ జారీ చేస్తారు.  

తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800, రేణిగుంట విమానాశ్రయంలో 200 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తారు.  కాగా  ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా  ఆక్టోబ‌ర్ 31వ తేది వ‌ర‌కు ఆన్ లైన్లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌కు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇస్తారు. ఇకపోతే నవంబర్ 1వ తేదీ నుంచి మాత్రం ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం నాలుగున్నర గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.