అయోధ్యలో శ్రీవారి ఆలయం..జాతీయ ప్రాణిగా గోవు! టీటీడీ పాలకమండలి తీర్మానం 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుడికో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందన వల్ల గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించారు. ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ ఉగాది నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని పాలక మండలి తీర్మానించింది. 

తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన  టీటీడీ పాలకమండలి సమావేశంలో 2021 - 22 బడ్జెట్ ను రూ. 2937.82 కోట్లతో ఆమోదించారు. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెడతామన్నారు. టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధి విధానాలను నిర్ణయించామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.

టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణం,  లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇప్పటికే ఉన్న కళ్యాణమండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకుంటామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా మార్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. బర్డ్ ఆసుపత్రిలోని పాత ఓపిడి భవనం, మొదటి అంతస్తులో శ్రీ వేంకటేశ్వర పీడియాట్రిక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి సివిల్, ఎలక్రిటికల్, ఏసీ తదితర అభివృద్ధి పనులకు రూ 9 కోట్లు మంజూరు చేశారు.

టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుండి 180. 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం తెలిపింది టీటీడీ. దీంతో  నెయ్యి నిల్వలను ఆరు రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చు. తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్ వినియోగానికి సంబంధించి జవాబుదారీ తనం పెంచేందుకు AP SPDCL ద్వారా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుమలలో క్రమంగా  50 మెగావాట్ల  గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయించింది. 

త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తామని టీటీడీ చైర్మెన్ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్  టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయంలో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయించామన్నారు వైవీ సుబ్బారెడ్డి.