TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సహనం కోల్పోయిన ట్రంప్.. ఇరాన్‌పై బూతుల వర్షం

Published on: Mon Apr 6, 2026 8:47AM

హోర్ముజ్ జలసంధి తెరిచే విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గుతున్నట్టు కనిపించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం  కట్టలు తెంచుకుంది. ట్రంప్ ఆదివారం(ఏప్రిల్ 5) సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోయారు. హోర్ముజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌ను ఇష్టారీతిన తిడుతూ నెట్టింట పోస్టు పెట్టారు. మంగళవారం (ఏప్రిల్ 7) నుంచీ ఇరాన్‌‌లో నరకం తప్పదని హెచ్చరించారు.

మునుపెన్నడూ చూడని స్థాయిలో పరిస్థితి దిగజారుతుందని హెచ్చరించారు.  మంగళవారం(ఏప్రిల్ 7)  పవర్ ప్లాంట్స్‌పై దాడులు, బ్రిడ్జ్‌పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి అంటూ అని బూతులతో ట్రంప్ చెలరేగిపోయారు. అమెరికా డెడ్‌లైన్‌ను ఇరాన్ ఖాతరు చేయకపోతుండటంతో ట్రంప్ నోటికొచ్చినట్టు తిడుతూ సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టారు. ఇరాన్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు పైలట్‌లను అమెరికా సైన్యం తాజాగా కాపాడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మునుపటి డెడ్‌లైన్‌ను మరోసారి గుర్తు చేశారు.

మరోవైపు..  ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై ఇరాన్   ఘాటుగా స్పందించింది. ఇరాన్‌లో మౌలిక వసతులపై దాడులు జరిగితే అమెరికాకు నరక ద్వారాలు తెరుచుకుంటాయని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ జనరల్ అలీ అబ్దుల్లాహీ ఆలియాబాదీ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ మిలిటరీ స్థావరాలు అన్నిటినీ టార్గెట్ చేస్తామని హెచ్చరించారు.