TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ దూకుడు.. ప్రమాదంలో అమెరికా అగ్రరాజ్య హోదా?!

Published on: Wed Jan 29, 2025 1:32PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తుంటే అమెరికా అగ్రరాజ్య హోదాకు ఆశలు వదిలేసుకోకతప్పదా అనిపిస్తున్నది. ఆయన వలసదారుల కబంధ హస్తాల నుంచి అమెరికాను విముక్తి చేస్తానంటూ ఎడాపెడా జారీ చేస్తున్న ఉత్తర్వులు, ఎగ్జిక్యుటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జన్మతహ పౌరసత్వం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, హెచ్1బి వీసాల విషయంలో అమలు చేస్తున్న ఆంక్షలు కానీ, ఇంకెంత మాత్రం ఇతర దేశాల నుంచి డాలర్ డ్రీమ్స్ తో అమెరికాకు వద్దామనుకునే వాళ్లను ఒకటికి పది సార్లు ఆలోచించేలా చేస్తున్నదనడంలో సందేహం లేదు.

ఇక తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరులు ఆదాయపన్ను చెల్లించనవసరం లేదనీ, వారి ఆదాయపన్ను రద్దు చేస్తున్నాననీ ప్రకటించారు. అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఆయన ఎంచుకున్న మార్గమే.. ఇతర దేశాలు అనివార్యంగా అమెరికాకు దూరం జరగక తప్పని పరిస్థితిలోకి వాటిని నెట్టేస్తున్నది. ఇంతకీ ఆ అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేసి.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయమేంటంటే ఇతర దేశాలపై భారీగా సుంకం వసూలు చేయాలని.  అమెరికా అలా అధిక సుంకం వసూలు చేయాలని నిర్ణయించుకున్న దేశాలలో ప్రధానంగా చైనా, ఇండియా, బ్రెజిల్ ఉన్నాయి. 

భారత్ పట్ల ఆయన అక్కసు గతం నుంచీ తెలిసిందే. ఇటీవలి ఎన్నికలలో విజయం సాధించి ఇంకా అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే ట్రంప్  భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. అమెరికా దిగుమతులపై భారత్ అధికంగా పన్నులు వసూలు చేస్తోందంటూ ఆయన నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.   విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేయడం ద్వారా అమెరికా దేశస్థులను సంపన్నులుగా చేయడమే తన లక్ష్యంగా ట్రంప్ లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఇందు కోసం ఆయన ఎక్స్ టర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రారంభించినట్లు కూడా ప్రకటించారు.   ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడం వల్ల అమెరికా మార్కెట్ ను లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయులు తీవ్రంగా నష్టపోతారు.  విదేశీయులపై కూడా సుంకం పెంచడమంటే అమెరికా లోని ఎన్నారైలు కూడా రిస్కు లో పడినట్లే. 

ఇక ట్రంప్ నిర్ణయాలు చదువు కోసం అమెరికా వెళ్లిన, వెళ్లాలనకుంటున్న భారతీయులకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే చదువుకోవడానికి అమెరికా వెళ్లిన భారతీయులు బయటకు రావడానికి భయపడుతున్నారు. పార్ట్ టైం జాబులు చేస్తే తమను అక్రమ వలసదారులంటూ దేశం నుంచి పంపించేస్తారని భయపడుతున్నారు.  చదువుకోసం వెళ్లినవారు చదువు పూర్తికాగానే స్వదేశా లకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ లు చేయడం నిబంధనలకు వ్యతిరేకమంటూ వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక యూరోపియన్ దేశాలపైనా ట్రంప్ తన ప్రతాపం చూపుతున్నారు. డాలర్ ను కాదని యూరో కరెన్సీ అనే దేశాలపై వంద శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఇక చైనాకు అయితే గట్టి ఝలకే ఇచ్చారు.   ట్రంప్ దూకుడు అమెరికాకు మేలు చేస్తుందా? నష్టం చేకూరుస్తుందా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ట్రంప్ నిర్వాకం వల్ల తొందరలోనే అమెరికా అగ్రరాజ్యం హోదా కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.