ఉప రాష్ట్రపతి ఎన్నికలో అల్వాకే టీఆర్ఎస్ మద్దతు
Published on: Fri Aug 5, 2022 11:24AM
ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ ఎంపీలు అందరూ మార్గరెట్ అల్వాకు ఓటు వేయాలని ఆదేశించారు. దీనితో ఉప రాష్ట్రపతి ఎన్నికలో టీఆర్ఎస్ ఎటువైపు అన్న సందిగ్ధతకు తెరపడింది.
.webp)
తెలంగాణలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ కు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం గత కొద్ది కాలంగా సాగుతున్న సంగతి విదితమే. ఇప్పడు ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. కాగా తెరాస మార్గరెట్ అల్వాకు మద్దతు పలుకుతోందనీ, టీఆర్ఎస్ ఎంపీలంతా మార్గరెట్ అల్వాకే ఓటు వేస్తారంటూ కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు ప్రకటన విడుదల చేశారు.
ఇలా ఉండగా కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష విషయంలో ఎటువైపు నుంచీ సానుకూలత వ్యక్తం కాని నేపథ్యంలో కేసీఆర్ అనివార్యంగా కాంగ్రెస్ కు చేరువ కావాలని ప్రయత్నిస్తున్న పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ స్పీడు పెంచడం.
వరుస ఉప ఎన్నికలతో తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలంటే కాంగ్రెస్ తో కలిసి నడవడమే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే నిన్న రాష్ట్రపతి ఎన్నిక విషయంలోనూ, ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలోనూ కేసీఆర్ కాంగ్రెస్ కు అనుకూల వైఖరి తీసుకున్నారంటున్నారు. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలోనూ టీఆర్ఎస్ ఎంపీలు పాలు పంచుకోవడాన్ని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. చేశారు.


