కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకివ్వరు?

 

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం సంతోషమే కానీ, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు కల్పించరని కేంద్రాన్ని బీజేపీ నేతలు ఎప్పుడైనా అడిగారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పట్ల బాధ్యత లేనట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడాన్నితెలంగాణ బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు సహజంగా ఇచ్చే అనుమతులనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది తప్ప, రాష్ట్రానికి అంతుకు మించి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో ఏవో నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేతలు ఎగిరిపడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేసారు.