టీఆర్ఎస్, కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ నాశనం: బాబు

 

 

 

హైదరాబాద్ నగరాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భ్రష్టు పట్టించాయని తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తెలంగాణలో అభివ‌ృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని, తెలుగుదేశం హయాంలోనే తెలంగాణ మిగులు బడ్జెట్‌లోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఘనత అంతా తెలుగుదేశం పార్టీకే చెందుతుందని, ఈ అభివృద్ధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ సహకారంగానీ, తోడ్పాటు గానీ లేదని చంద్రబాబు అన్నారు. ఈ రెండు పార్టీలు హైదరాబాద్‌ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశాయని ఆయన విమర్శించారు. తెలంగాణ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామని, బాబ్లిపై మహారాష్ట్రానికి వెళ్లి పోరాటం చేశామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ కోసం పరాయి రాష్ట్రంలో జైలులో ఉన్నది తెలుగుదేశం నేతలేనని ఆయన అన్నారు. తెలంగాణ టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ రాజీ పడలేదని ఆయన అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌‌కి ముఖ్యమంత్రిగా వున్నప్పటికీ తెలంగాణ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చెప్పారు.