బాలినేనికి చెమటలు పట్టిస్తున్న మాగుంట పార్వతమ్మ
Published on: Mon May 14, 2012 11:49AM
ఒంగోలు అసెంబ్లీ ఉప ఎన్నికలు ఆసక్త్రికరంగా మారుతున్నాయి. మూడు ప్రధానపార్టీల అభ్యర్థులు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. వీరిలో ఇద్దరు భ్యర్తులకు ఒకే పార్టీ (కాంగ్రెస్)లో తానులో ముక్కల్లా కలిసి పనిచేసిన గత అనుభవం వుంది. ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే దామచర్ల జనార్థన్ మాత్రం మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు కుటుంబవారసుడు. మాజీ ఎంపి మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అలాగే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా తాజామాజీ బాలినేని శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు.
జగన్ పార్టీ పెట్టకముందు బాలినేని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగానూ, మూడుసార్లు ఎమ్మెల్యేగానూ నియోజకవర్గంలో బలమైన గుర్తింపు పొందారు. మాగుంట సుబ్బరామిరెడ్డి తరువాత రాజకీయ వారసత్వంగా పార్వతమ్మ ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలు. అయితే ఆమె తరువాత ప్రస్తుత ఎంపి మాగుంటే శ్రీనివాసరెడ్డి వరుస విజయాలతో నియోజకవర్గంలో నిలకడగా ఉన్నారు. కుటుంబ చేరిత్రే తప్పించి నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని శ్రీనివాసులరెడ్డిపై నియోజకవర్గ ఓటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో బాలినేని తాను రాజీనామా చేసి జగన్ పార్టీకి మారడం ఆయనకు ప్లస్ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. నాలుగోసారి కూడా బాలినేని ఈ స్థానం నుంచి గెలుపొందుతారని నియోజకవర్గ పరిశీలనతో తేలుతోంది. కానీ, ఈయనకు మాగుంట పార్వతమ్మ మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలరనీ, చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగితే ఆమె గెలుపొందే అవకాశాలూ ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దీనికి తోడు మాగుంట కుటుంబం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తుండడంతో బాలినేనికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక జనార్థన్ విషయానికి వస్తే రాజకీయ కుటుంబ వారసత్వమే కానీ, నియోజకవర్గంలో ఓట్లను కూడగట్టే అనుభవం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మాగుంట పార్వతమ్మ అభ్యర్థిత్వం ఖరాలు కాకముందు జనార్థన్ పోటీలో ఉన్నారు. ఇక ఇటీవల ప్రచారాలను పరిశీలిస్తే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు బాలినేనిపై కాలుదువ్వు తున్నాయి. అవినీతికి బాలినేని చిరునామా అంటూ పీసీసీ చీఫ్ బొత్సా ఇక్కడే చిందులు తొక్కారు. అలానే తలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా బాలినేని సొంత నియోజకవర్గం అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు. అసలు నేనేమి చేశానో మీకే తెలుసు కాబట్టి నాకు అవకాశమివ్వాలని బాలినేని ఓటర్లను అభ్యర్థించారు. అటు ప్రచారసరళి, ఇటు స్పందనలు కూడగట్టుకుంటే బాలినేని ఈ నియోజకవర్గం నుంచి బలంగా కనిపిస్తున్నారు. ఇక కుటుంబ చరిత్ర ప్రకారం మాగుంట పార్వతమ్మ, దామచర్ల జనార్థన్ రేసులో ఉన్నారు. దీనితో ఈ ఎన్నికలు త్రిముఖపోతీగా ఉంటాయని పరిశీలకులు ధృవీకరిస్తున్నారు.


