రైల్లోంచి తోసేశారు..నేడు చితకబాదారు

రైళ్ళలో తనిఖీలు చేయాలంటేనే టీసీలు తెగ భయపడిపోతున్నారట. ఎవరిని టికెట్ అడిగితె ఎవడూ ఏం చేస్తాడోనని టీసీలు బిక్కుబిక్కుమంటూ తమ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి హైదరాబాద్ నగరంలో రైళ్ళలో టీసీలపై జరుగుతున్న దారుణాలే కారణం. మొన్న హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో టిక్కెట్ చూపించమని అడిగిన పాపానికి టికెట్ కలెక్టర్ గీతను కొందరు దుండగులు రైలులో నుండి తోసివేశారు. ఆ సంఘటన జరిగి ఇంకా పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. తాజాగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో మరో సంఘటన చోటుచేసుకుంది. టికెట్ తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న టీసీ కౌసల్యను టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు చితకబాదారు. ప్రయాణికుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటలనలతో భయపడిపోతున్న టీసీలు తమ రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.