స్కూలు బస్సు ప్రమాదం: విషాదంలో మూడు గ్రామాలు!

 

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో 26 మంది చిన్నారులు మరణించారు. ఈ దుర్ఘటనలో మరణించిన విద్యార్థులందరూ మెదక్ జిల్లాలోని ఇస్లాంపూర్, వెంకటాపల్లి, గూనేపల్లి గ్రామాలకు చెందినవారు. స్కూలు బస్సు ప్రమాదానికి గురైందని తెలియగానే ఈ మూడు గ్రామాలకు చెందిన ప్రజలు దుర్ఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సులో పిల్లలున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఘటనా ప్రాంతం దద్దరిల్లిపోతోంది. ప్రమాదంలో కొనప్రాణంతో వున్న తొమ్మిదిమంది విద్యార్థులను అంబులెన్స్.లో హైదరాబాద్‌కి తరలించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పద్మారావు అక్కడ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.