అమెరికాలో విషాదం... ఫ్లోరిడాలో తెలుగు యువతి మృతి
Published on: Sun May 10, 2026 9:43AM

అమెరికాలో జరిగిన ఓ దుర్ఘటన హైదరాబాద్ లో నివసిస్తున్న ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఎల్బీనగర్ లింగోజిగూడ న్యూ శివపురి కాలనీకి చెందిన దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కుమార్తె శ్రీవీణ అమెరికాలోని వర్జీనియా లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఇటీవల బంధువుల తో కలిసి వెకేషన్ కోసం ఫ్లోరిడా వెళ్లిన ప్రవీణ అక్కడ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్లో ఈతకు దిగి ప్రమాదవ శాత్తు నీటిలో మునిగిపోయింది. అది గమనించిన సన్నిహితులు వెంటనే ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర షాక్కు గురయ్యారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని త్వరలో భారత్కు తీసుకురావడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రస్తుతం శ్రీవీణ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఆనందంగా మొదలైన వెకేషన్ ఒక్కసారిగా విషాదంగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


