హబ్సిగూడలో విషాదం... ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్య
Published on: Tue Mar 11, 2025 10:54AM
హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్రెడ్డి (44), కవిత (35) దంపతులు ఏడాది క్రితం హైద్రాబాద్ హబ్సిగూడకు బతుకుదెరువు కోసం వచ్చారు. వీరికి 10 ఏళ్ల విశ్వాన్రెడ్డి , 15 ఏళ్ల శ్రీతరెడ్డి సంతానం. చంద్రశేఖర్రెడ్డి ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేసి మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం సద్యోగం లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆర్థిక సమస్యలతో ఆ కుటుంబం సతమతమయ్యింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబం తిరిగిరాని లోకాలకు చేరుకుంది. సోమవారం కుమారుడు విశ్వాన్రెడ్డికి విషమిచ్చి చంపేసిన తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీతరెడ్డికి మాత్రం ఉరివేసి చంపేశారు. పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న భార్యాభర్తలు ఇద్దరూ ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు చంద్రశేఖర్ రెడ్డి రాసిన సుసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. మా చావులకు ఎవరూ కారణం కాదు అని ఆ నోట్ లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


