డ్రగ్స్ కేసులో పార్ట్-2 ఉంటుందా?... సెకండ్ లిస్ట్లో ప్రముఖులు ఎవరు?
posted on Aug 2, 2017 12:26PM
12 రోజులు... 12మంది టాలీవుడ్ ప్రముఖులు... సుమారు 92 గంటలు... సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఫస్ట్ పార్ట్ ముగిసింది... రోజుకొకరు చొప్పున సిట్ విచారణ కంప్లీట్ చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో మొదలైన సిట్ ఎంక్వైరీ.... యువ నటుడు నందుతో ముగిసింది. మొదటిరోజు పూరీ జగన్నాథ్ను సుమారు 11గంటలపాటు విచారించిన సిట్... మిగతా వారిలో వణుకు పుట్టించింది. ఉదయం 10 గంటలకు మొదలైన ప్రశ్నల వర్షం రాత్రివరకూ కంటిన్యూ అయ్యింది. దాంతో పూరీ జగన్నాథ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాంతో డ్రగ్స్ కేసులో రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది.
ఆ తర్వాత కెమెరామెన్ శ్యామ్ కే నాయుడుని 6 గంటలు, కేరెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుని 13 గంటలు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా 4 గంటలు, హీరో నవదీప్ని 11 గంటలు, తరుణ్ను 13 గంటలు, హీరోయిన్ ఛార్మిని హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10నుంచి ఐదు గంటల వరకు విచారించింది. ముమైత్ ఖాన్ని 6 గంటలు, రవితేజను 9 గంటలు, రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్లను 4 గంటలు, నందుని మూడున్నర గంటల చొప్పున ఇంటరాగేట్ చేసింది. విచారణ మొత్తం వీడియో చిత్రీకరించింది. కొందరు బ్లడ్ శాంపిల్స్ ఇస్తే... మరికొందరు నిరాకరించారు. అయితే పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజ, తరుణ్ విషయంలో మీడియా భారీ హైప్ ఇచ్చింది.
డ్రగ్స్ తీసుకుంటారా? డ్రగ్స్ ఎప్పట్నుంచి అలవాటు ఉంది? కెల్విన్, జీశాన్తో ఎలా పరిచయం? డ్రగ్స్ తీసుకోవడమేనా...సప్లై కూడా చేస్తారా? పబ్ల్లో డ్రగ్స్ సరఫరా చేస్తారా? డ్రగ్స్ను ఎవరికైనా అలవాటు చేశారా? సినీ పరిశ్రమలో ఇంకా ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు? ఇలా సాగింది సిట్ ఇంటరాగేషన్. అయితే తొలి విడత విచారణ కంప్లీట్ కావడంతో... పార్ట్-2 ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తొలి విచారణలో సేకరించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ లిస్ట్లో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో డ్రగ్స్ కేసులో పార్ట్-2 ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారని గుర్తించిన సిట్ అధికారులు... సెకండ్ లిస్ట్లో వీళ్లను మాత్రమే పిలిచి మమ అనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.