TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఎంసీ పనైపోయింది.. నెక్ట్స్ టారెట్ సమాజ్ వాదీ పార్టీ.. సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు

Published on: Tue May 5, 2026 3:30PM

పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న సువేందు అధికారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు.  ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి..  మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు. 

ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి..  మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరించారు. 

తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని.. అందుకే నందిగ్రామ్‌ ప్రజలు మరోసారి తనను గెలిపించారన్నారు. దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని   జోస్యం చెప్పిన సువేందు అధికారి.. ఇక తమ   దృష్టిపి  సమాజ్‌వాదీ పార్టీపై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరిక జారీచేశారు. 

ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.