సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి
Published on: Tue Sep 30, 2025 10:47AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడవ రోజు మంగళవారం (సెప్టెంబర్ 30) ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఇక రాత్రి చంద్రప్రభ వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేయనున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా గత ఆరు రోజుల్లో గరుడ వాహనంతోపాటు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి ఆరో రోజైన సోమవారం రాత్రి గజవాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.


