TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లడ్డూ కల్తీతో మనస్తాపం... పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష!

Published on: Sun Sep 22, 2024 1:27AM

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ ద్వారా అపవిత్రం అయిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురయ్యారు. ఆ ఘోర తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ఆయన 11 రోజులపాటు ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేయాలని సంకల్పించుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.  ఆ ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది....

ఏడుకొండలవాడా..! క్షమించు... 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష.

అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష కొనసాగిస్తాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. 'దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ'ని వేడుకుంటాను.

భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది.
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.

ధర్మో రక్షతి రక్షితః

-పవన్ కళ్యాణ్