TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ది అడ్డగోలు వాదన.. కుండబద్దలు కొట్టేసిన అర్నాబ్ గోస్వామి

Published on: Sat Feb 7, 2026 2:26PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చజరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో నిజాల నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలోని సీట్  దర్యాప్తు చేసి నివేదిక సమర్పించింది. ఇప్పుడు ఆ నివేదికపై తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సిట్ నెయ్యిలో కల్తీని నిర్ధారించడమే కాకుండా, జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చింది.  
అయితే సిట్ నివేదికను తనకు అనుకూలంగా చెప్పుకుంటూ వైసీపీ రాజకీయం మొదలెట్టింది. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కతోవ పట్టించే విధంగా వైసీపీ కొత్త వాదనకు తెరతీసింది. చంద్రబాబు ఆరోపించినట్లుగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనీ,  చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేశారంటూ ఎదురు దాడికి దిగింది.  దీనిపై ప్రస్తుతం ఏపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు అవాస్తవాలను చెప్పారంటూ వైసీపీయులు చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం దీటుగా జవాబిస్తోంది.

సరిగ్గా ఈ తరుణంలో విషయం జాతీయ స్థాయి మీడియాలోనూ చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు. సిట్ నివేదికలోని అంశాలను చదివి మరీ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తు తేల్చిందనీ, ఇంత అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా అడ్డగోలు వాదనలేంటంటూ జగన్ ను ఆయన పార్టీ ప్రతినిథులను నిలదీశారు.  

మూడు శతాబ్దాలుగా భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి వైసీపీ మహాపాపానికి ఒడిగట్టిందని అర్నాబ్ గోస్వామి నిష్కర్షగా చెప్పారు.  జగన్ హయాంలో అంటే  2019-24 మధ్య కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి ముమ్మాటికీ కల్తీదేనని దర్యాప్తు సంస్థలు సందేహాలకు అతీతంగా తేల్చేశాయన్నారు.

అక్కడితో ఆగకుండా, ఆయన జగన్ ను ఆయన విశ్వసించే మతాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తువుల సెంటిమెంటుతో  ఇలా ఆడుకోగలరా అని సూటిగా ప్రశ్నించారు.  లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులూ ఎత్తి నమస్కరించి క్షమాపణలు చెప్పాలని అర్నాబ్ గోస్వామి వైసీపీ నేతలను డిమండ్ చేశారు. అలాగే ఇదే అంశంపై జరిగిన చర్చలోనూ వైసీపీ నేతలను నిలదీసి నిలబెట్టేశారు.