బాబోయ్.. బాబోయ్ పెద్దపులి!
Published on: Wed Jun 3, 2026 12:16PM
.webp)
ఆంధ్రప్రదేశ్లోని మన్యప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం బెంబేలెత్తిస్తోంది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్దపులి దాడిలో 14 లేగదూడలు చనిపోయాయి. మంగళవారం రాత్రి గ్రామ శివారులో పశువుల మందపై పెద్ద పులి దాడి చేసి 14 లేగదూడలను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు భయంతో వణికి పోతున్నారు.
ఉదయాన్నే పశువుల కాపరులు, యజమానులు తమ పశువుల శాలల వద్దకు వెళ్లేసరికి అక్కడ కనిపించిన దృశ్యాలు వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. రక్తం మడుగులో చెల్లాచెదురుగా పడి ఉన్న 14 దూడల మృతదేహాలను చూసి పశువుల యజమానులు గుండె లబోదిబోమన్నారు. తమ జీవనాధారమైన పశుసంపద ఇలా పులి పంజాకు బలికావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఈ ఘోర ఉదంతం చుట్టుపక్కల గ్రామాల్లో దావానలంలా వ్యాపించడంతో, గంగంపాలెంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇప్పుడు బయటకు రావాలంటేనే భయంతో గజగజలాడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖఅధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్ద పులిని వీలైనంత త్వరగా బంధించడానికి రాపిడ్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దించి ఒక ప్రత్యేక ఆపరేషన్ను ప్రారంభించారు.


