తెలుగు రాష్ట్రాలలో ఈ వేసవి నిప్పుల గుండమే!
Published on: Thu Mar 26, 2026 4:53PM

తెలుగు రాష్ట్రాలలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాతావరణం ఒకింత చల్లబడింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులలో తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనీ, అక్కడక్కడ వడగళ్లు, పిడుగులూ పడే అవకాశం ఉందనీ పేర్కొంది.
అయితే ఆ తరువాత నుంచీ ఓ మూడు నెలల పాటు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలతో హీట్ వేవ్ ను తలపించే పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలలతో పాటు జూన్ నెలలో కూడా తెలుగు రాష్ట్రాలలో హీట్ వేవ్ కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది వేసవి తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది. సాధారణం కంటే 5 నుంచి 5.5 డిగ్రీల సెల్సియస్ వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.


