ఇది ఆంధ్రులకు దక్కిన గౌరవం.. చంద్రబాబు
Published on: Wed Apr 1, 2026 4:10PM
ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారాయన.
ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని భరోసా ఇచ్చారు. బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేశారు.


