TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇదీ దేవుడి స్క్రిప్టేగా జగన్

Published on: Tue Feb 25, 2025 11:42AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నోట తరచుగా వచ్చే మాట దేవుడి స్క్రిప్ట్. ఈ పదాన్ని ఆయన 2019 ఎన్నికలలో వైసీపీ విజయం నుంచీ మొదలు పెట్టారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ.. సమయం, సందర్భం లేకున్నా దేవుడి స్క్రిప్ట్ గొప్పగా ఉందంటూ వ్యాఖ్యలు చేసే వారు. 

2024 ఎన్నికలలో అదే దేవుడు వైసీపీకి అంత కంటే గొప్పగా స్క్రిప్ట్ రాశాడు. ఆ పార్టీకి కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయాన్ని అందించి ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదు పొమ్మన్నాడు. గతంలో జగన్ ప్రతి విషయాన్ని 23 నంబర్ తో ముడిపెట్టి తెలుగుదేశంపై సెటైర్లు గుప్పించేవారు. ఇప్పుడు అదే పని తెలుగుదేశం శ్రేణులు చేస్తున్నాయి.  పదకొండు నంబర్ ను ప్రస్తావిస్తూ తెలుగుదేశం శ్రేణులు జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నాయి. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 24) జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో వాస్తవానికి వైసీపీ పార్టీకి బ్లాక్ 12 కేటాయించారు. అయితే తెలుగుదేశం సోషల్ మీడియా సైనికులు సృజన జోడించి బ్లాక్ 12ను బ్లాక్ 11గా మార్చి ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. 

వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ శపథం చేసిన జగన్.. ఆ ప్రతిజ్ణను పక్కన పెట్టి.. తనపైనా, తన పార్టీ ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుందన్న భయంతో అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టీ పెట్టడంతోనే విపక్ష హోదా ఇవ్వాలంటూ పోడియం ముందు నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. సరిగ్గా 11 నిముషాల తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక్కడా 11 నంబర్ ను గుర్తు చేస్తూ తెలుగుదేశం జగన్ ను ఎగతాళి చేసింది. అయితే సభా నియమాలు, నిబంధనలపై ఇసుమంతైనా అవగాహన లేని జగన్ కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి హాజరైనంత మాత్రాని సభలో అటెండెన్స్ వేయించుకున్నట్లు కాదన్న విషయం తెలియలేదు. దీంతో ఆయన అసెంబ్లీ హాజరు వ్రతమూ చెడింది.. ఫలితమూ దక్కలేదన్నట్లుగా తయారైంది.  సరే గవర్నర్ ప్రసంగం తరువాత సభ వాయిదా పడింది.

అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అదే 11 సంఖ్యలు ప్రస్తావిస్తూ జగన్ పై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు.  సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలేననీ, ఆ ప్రజలు జగన్ కు కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి ఆ హోదాకు జగన్ అనర్హుడని తేల్చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలోనైనా జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఆ పార్టీ జనసేనకు ఇప్పుడు ఉన్న స్థానాల కంటే కనీసం ఒక్క సీటైనా ఎక్కువ గెలుచుకోవలసి ఉంటుందని గుర్తు చేశారు. అలా కాకుండా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబట్టాలంటే ఇండియాలో కాదు, జర్మనీ వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు.  మొత్తం మీద 11 సీట్ల స్క్రిప్ట్ తో దేవుడు జగన్ కు భలే ఇబ్బందులు తెచ్చిపెట్టాడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.