TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ నాయకత్వంలో భవిష్యత్‌ వైపు దేశం పరుగులు!

Published on: Mon Apr 20, 2026 2:19PM

 

భారత రాజకీయ యవనికపై నరేంద్ర మోదీ ప్రస్థానం ఒక విశిష్ట అధ్యాయం. సాధారణంగా రాజకీయ నాయకులు అనగానే తక్షణ ఓటు బ్యాంకు రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు ఓటములు, దైనందిన వార్తల్లో ఎలా నిలవాలి అనే అంశాలపైనే  ఆలోచిస్తుంటారు. అయితే మోదీ శైలి వీటికి భిన్నంగా ఉంటుంది.  ఆయన కేవలం వచ్చే ఐదేళ్ల పదవీ కాలం గురించి కాకుండా, రాబోయే ఐదు దశాబ్దాల పాటు భారతదేశం ప్రపంచ పటంలో ఎలా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రధాని మోదీ రాజకీయ చదరంగంలో ఎప్పుడూ ప్రత్యర్థుల కంటే పది అడుగులు ముందే ఉంటారు. ఆయన నాయకత్వంలో రెండు ప్రధాన కోణాలు కనిపిస్తాయి. ఒకటి  ప్రాక్టివ్  నాయకత్వం, అంటే దేశానికి అవసరమైన కఠినమైన సంస్కరణలను ముందుగానే ఊహించి అమలు చేయడం. రెండవది  రియాక్టివ్  అవగాహన.  అంటే ప్రత్యర్థుల ఎత్తుగడలను నిశితంగా గమనిస్తూ, వారు వేసే అడుగులను ముందే పసిగట్టి సమర్థవంతమైన ప్రతివ్యూహాలను సిద్ధం చేయడం. ఈ అరుదైన వ్యూహరచనే ఆయనను సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా నిలబెడుతోంది.

గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన  కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి,  చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల కల్పన , తయారీ రంగం బలోపేతం వంటి అంశాలపై మోదీ ప్ర  ప్రత్యేక దృష్టి సారించారు.

 విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ విజయవంతం కావడానికి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వ విధానాలే కారణమని ఆర్థిక వేత్తలు అంటున్నారు. కేవలం తక్షణ ఉపశమనం కలిగించే పథకాల కంటే, దేశ భవిష్యత్తును మార్చే పునాదులపైనే ఆయన ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు.

సహజంగానే ఏ నాయకత్వానికైనా విమర్శలు అనివార్యం మోడీ వ్యతిరేకులు తరచూ ఆర్థిక విధానాలు, అంతర్గత రాజకీయాలు లేదా విదేశాంగ విధానంపై విరుచుకుపడుతుంటారు. అయితే, ఈ విమర్శలు చాలావరకు తాత్కాలిక సమస్యల చుట్టూ తిరుగుతుంటాయని, మోదీ మాత్రం శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేస్తారని ఆయన మద్దతుదారులు వాదిస్తారు. విమర్శకులు ఈ రోజు గురించి ఆలోచిస్తే, మోదీ రేపటి భారతాన్ని నిర్మిస్తున్నారని వారి వాదన. భారతదేశం ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక ప్రభావమంతమైన శక్తిగా ఎదుగుతోంది. జియోపాలిటికల్ గా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

రాబోయే కాలంలో భారత్ ను ఒక సురక్షితమైన, ఆర్థికంగా తిరుగులేని దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతుందని అంచనా. ఈ ప్రయాణం చివరకు భారతదేశాన్ని ‘విశ్వగురు’ స్థానంలో నిలబెడుతుందని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.ముగింపుగా చూస్తే, మోదీ నాయకత్వాన్ని కేవలం ఎన్నికల గెలుపోటముల కోణంలో చూడలేం. అనుకూల వర్గం ఆయనను ఒక దార్శనికుడిగా కొనియాడుతుంటే, విమర్శకులు భిన్నంగా స్పందిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ, మోదీ తీసుకునే ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక బలమైన పునాది అని ఆయన అనుచరులు బలంగా నమ్ముతున్నారు. ఆయన రాజకీయాలు కేవలం ఈనాటి వార్తల కోసం కాదు, రాబోయే తరాల శ్రేయస్సు కోసం ఉద్దేశించినవని స్పష్టమవుతోంది.

-సీతారాం కంఠంనేని