TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీబీజేపీ నాయకత్వానికి ఎలాంటి ట్రీట్ మెంట్ కావాలంటే?

Published on: Fri Jun 30, 2023 3:26PM

తెలంగాణ బీజేపీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా అంటే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితిని గమనిస్తే ఎవరైనా ఔననే అంటారు.  గత తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దిగజారుతుంటే ఆ స్థానాన్ని బీజేపీ చాకచక్యంగా ఆక్రమించే పని చేసింది. ఇందుకోసం తమ పార్టీ సిద్ధాంతాలను సైతం తుంగలో తొక్కేసింది. రాజకీయ నిరుద్యోగులు ఎక్కడ ఉంటే  అక్కడ వారిని గాలమేసి తన పార్టీలోకి చేర్చుకుంది. అయితే, ఇప్పుడు అదే ఆ పార్టీకి నష్టం చేకూరుస్తోంది. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ మాంచి ఊపు మీదుంటే.. ఇప్పుడు ఆ ఊపు చూసిన కొందరు బీజేపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా కమలానికి గుడ్ బై చెప్పేసి హస్తం రెక్కలు కట్టుకుని దూకేయడానికి సిద్ధపడుతున్నారు.  ఈ క్రమంలోనే బీజేపీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి.

తెలంగాణలో బీజేపీలో నేతల మధ్య సఖ్యత లేదని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నదని సొంత పార్టీ నేతలే  పలు సందర్భాలలో చెప్పారు. ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అధ్యక్షడిగా నియమించనున్నారని ముందుగా కథనాలు రాగా.. అది ఇప్పటి వరకూ వాస్తవ రూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే ఇక ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది కాకుండా బీజేపీలోనే మిగతా నేతల మధ్య కూడా ఆధిపత్య వార్ జరుగుతున్నదన్నది కూడా బహిర్గతమే. అయితే, దీనిపై ఎక్కడా ఎవరూ మాట్లాడలేదు. అక్కడా ఇక్కడా పార్టీ నేతల మధ్య సంభాషణలే ఇంతవరకు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇప్పుడు తొలిసారి ఓ బీజేపీ నేత చేసిన ట్వీట్ తెలంగాణలో బీజేపీలో వివాదాల కుంపటి రగులుతున్నదని తేటతెల్లం చేసింది.

బీజేపీ సీనియర్ నేత జితేంద‌ర్ రెడ్డి చేసిన ఓ పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో క‌ల‌క‌లం రేపింది. సంచలనంగా కూడా మారింది. దున్న‌పోతు తోక గ‌ట్టిగా లాగి.. డొక్క‌లో త‌న్ని మ‌రీ.. దారిలో పెడుతున్న ఓ వీడియోను ఆయన త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన జితేందర్ రెడ్డి..  బీజేపీ తెలంగాణ నాయకత్వానికి కూడా ఇటువంటి ట్రీట్మెంట్ అవసరమని కామెంట్ చేశారు.  అంతేకాదు.. ఈట్వీట్‌ను ఆయ‌న బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా, మ‌రో నేత బీఎల్ సంతోష్‌, బ‌న్సాలీల‌కు కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఇది తీవ్ర స్థాయిలో చ‌ర్చకు దారి తీసింది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ ఆ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే జితేంద‌ర్ రెడ్డి దాన్ని డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఆ ట్వీట్   అప్ప‌టికే వైర‌ల్ అయిపోయింది. అప్పటికే దాన్ని రీ ట్వీట్లు, స్క్రీన్ షాట్స్ రూపంలో తెగ వైరల్ చేశారు.దీంతో డిలీట్ చేసి తక్కువ అవ్వడమెందుకు అనుకున్నారో ఏమో జితేందర్ రెడ్డి  దానిని మళ్లీ ట్వీట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఎక్కడ చూసినా ఈ ట్వీట్ గురించే చర్చ సాగుతుంది. 

రాష్ట్ర బీజేపీకి కీల‌క నేతలైన వారిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తుండగా.. వారు స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని.. వారిని స‌రైన దారిలో పెట్టాలంటే ఇలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేననే  అర్ధం వ‌చ్చేలా జితేంద‌ర్ రెడ్డి ఈ వీడియోను పోస్టు చేశార‌ని స్పష్టంగా తెలిసిపోతున్నది. మరి ఆ కీలక నేత ఎవరు? ఆ నేతకి జితేందర్ కి మధ్య సఖ్యత ఎందుకు చెడింది? అసలు జితేందర్ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశారు అన్న చర్చ ఇప్పుడు ఎక్కడ చూసినా జరుగుతుంది. ఇప్పటికే పార్టీచీఫ్ బండి సంజయ్ కి వ్యతిరేకంగా కొందరు చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ఈటల, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు జెండా కింద పడేస్తారో తెలియడం లేదు. మరోవైపు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ లాంటి వాళ్ళు కూడా సరైన సమయం కోసం చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో పార్టీలో నేతల మధ్య పెరుగుతున్న ఈ అంతరం కమలనాథులకు కునుకు లేకుండా చేయడం గ్యారంటీ! ఇదిలా ఉంటే రాజకీయవర్గాల్లో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరే ఉద్దేశంతోనే ఈ ట్వీట్ చేశారన్న చర్చ జరుగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం ద్వారా  బీజేపీ హైకమాండ్ తనపై క్రమశిక్షణ చర్య తీసుకుని సస్పెండ్ చేస్తే వెంటనే హస్తం గూటికి చేరే వ్యూహంతోనే బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ట్రీట్మెంట్ కావాలంటూ వివాదాస్పద ట్వీట్ చేశారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వచ్చే నెల 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. ఆ బహిరంగ సభా వేదిక మీద నుంచే  పొంగులేటి, జూపల్లి తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. జితేందర్ రెడ్డి కూడా అదే ముహూర్తానికి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని వారంటున్నారు. అందుకే బీజేపీకి  ఆగ్రహం కలిగి తనపై చర్య తీసుకునే విధంగా వివాదాస్పద ట్వీట్ చేసి పార్టీ హైకమాండ్ కే ట్యాగ్ చేశారనని అంటున్నారు.