TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు

Published on: Fri May 8, 2026 9:57AM

అమెరికా, ఇరాన్  మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెచ్చరిల్లాయి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న అమెరికా యుద్ధనౌకకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ డ్రోన్‌ను అమెరికా రక్షణ దళాలు విజయవంతంగా కూల్చివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే, అమెరికాకు చెందిన  యుఎస్ఎస్ బాక్సర్  అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా..  ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్..  నౌకలోని సిబ్బందికి,  నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ముందుకు రావడంతో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా అమెరికా సైన్యం ఆ డ్రోన్‌ను పేల్చివేసింది.

ఈ పరిణామంపై శ్వేతసౌధం నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ ఉద్దేశపూర్వకగానే అమెరికా నౌకలపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ట్రంప్ విమర్శించారు. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ, శాంతి భద్రతలను విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను సహించేది లేదని   హెచ్చరించారు. తమ సిబ్బందిని, ఆస్తులను రక్షించుకోవడానికి అమెరికాకు పూర్తి హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.

గత కొద్దికాలంగా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు సరఫరాకు అత్యంత ప్రధానమైన హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికాకు కంటగింపుగా మారాయి. గతంలో కూడా ఇరాన్ ఇలాంటి డ్రోన్లను అమెరికా నిఘా ప్రాంతాల్లోకి పంపడం, ప్రతిగా అమెరికా ఆంక్షలు విధించడం వంటి పరిణామాలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి.

 ఇరాన్  అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికాయే కాల్పుల విరమణను ఉల్లంఘించి తమ నూనె ట్యాంకర్ సహా రెండు నౌకలపై దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. దానికి ప్రతిస్పందనగానే తాము అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్, బందర్ అబ్బాస్ వంటి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక ప్రశాంతతకు తెరపడి, యుద్ధ వాతావరణం నెలకొంది.