ఆర్థికంగా దివాళా తీసిన కె.ఎ.పాల్?
Published on: Fri May 4, 2012 9:46AM
ఆర్థికంగా దివాళా తీసిన కె.ఎ.పాల్?
ప్రజాశాంతి పార్టీలో అశాంతి
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం
క్రైస్తవమత ప్రచారకుడు కె.ఎ.పాల్ ఇటీవల ఏర్పాటు చేసిన ప్రజాశాంతి పార్టీలో అశాంతి మొదలైంది. వచ్చే శాసనసభ ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని కె.ఎ.పాల్ ఇప్పటికే ప్రకటించారు. నాలుగునియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులను కూడా ఆయన ఖరారు చేశారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. కె.ఎ.పాల్ దగ్గర భారీగా నిథులుంటాయన్న ఉద్దేశ్యంతో ఆ పార్టీ తరపున పోటీ చేయటానికి అనేకమంది ముందుకు వచ్చారు. కానీ, అభ్యర్థులను ఖరారు చేసేటప్పుడు కె.ఎ.పాల్ వారిని తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపోటములను పైన ఉన్న ప్రభువే చూసుకుంటాడని, ఆయన ఆశీస్సులు మీకు దక్కటానికి ప్రార్థనలు చేస్తానని కె.ఎ.పాల్ అంటుండడంతో ఆశావాదులంతా నిరాశకు గురవుతున్నారు. అంతే తప్ప ఎన్నికల ఖర్చుపై ఆయన ఏమీ మాట్లాడటం లేదు. పోటీ చేసేవారు ఓటర్లకు డబ్బు ఇవ్వొద్దని, ఎన్నికల్లో ఎవరి ఖర్చు వారే పెట్టుకోవాల్సిందిగా సలహా ఇస్తున్నారు. ఈ పార్టీ తరపున పోటీ చేసి కె.ఎ.పాల్ ఇచ్చే డబ్బులో కొంత ఖర్చు చేసి కొంత మిగుల్చుకోవచ్చనుకున్న వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే మీమాంసలో పడ్డట్లు తెలిసింది. నిజానీ కె.ఎ.పాల్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసింది. విదేశాల నుంచి ఆయనకు నిథులు రావడం బాగా తగ్గిపోయింది.
ఆయన దాతలు ఇచ్చిన నిథులతో బోయింగ్ 747 పాత విమానాన్ని కొనుగోలు చేశారు. అమెరికా అధ్యక్షుడి అధికార విమానానికి ఎయిర్ ఫోర్స్ వన్ అనే పేరు ఉంది. దీనికి పోటీగా అన్నట్లు పాల్ తన పాత విమానానికి గ్లోబల్ పీస్ వన్ అనే పరు పెట్టి ఆర్భాటంగా అనేక దేశాలు తిరిగాడు. అయితే దీని నిర్వహణ విషయంలోనే పాల్ ఆర్థికంగా నష్టపోయారని తెలిసింది. దాతలు ఇచ్చే నిథులు పూర్తిగా దీనికే వెచ్చించినా సరిపోలేదు. ఒకానొక దశలో విమాన పైలెట్లకు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో పాల్ పై వారు కేసులు కూడా వేశారు. ఈ విమానానికి మరమ్మత్తులు కూడా చేయలేని స్థితిలో పాల్ దీనిని మెక్సికోలో వదిలేసి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చిన కె.ఎ.పాల్ క్రైస్తవ సభలను ఎన్నికల ప్రచార సభలుగా మార్చివేస్తున్నారన్న విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. దీనిపై క్రైస్తవ మతపెద్దలే తమ నిరసనను కె.ఎ.పాల్ కు తెలియజేస్తున్నారు.


