TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2034 వరకు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రాదు!

Published on: Thu Apr 23, 2026 8:49PM

 

తెలుగువన్ ‘వాస్తవ వేదిక’లో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని తాజా రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లు వాయిదా పడటం మహిళలను నిరుత్సాహానికి గురిచేస్తోందని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, మహిళలకు నిరీక్షణ కొత్త విషయం కాదని, 1996లో మాజీ ప్రధాని దేవేగౌడ కాలం నుంచి ఈ అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఈ బిల్లుకు మద్దతు తెలిపిందని, బీజేపీ మాత్రం ఇటీవలి కాలంలో ఒకసారి మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంలో మహిళలకు సమాన హక్కులపై స్పష్టత లేదని, వారు మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరిస్తారని డోలేంద్ర ప్రసాద్ విమర్శించారు. మనుస్మృతిలో మహిళలకు సముచిత గౌరవం, హక్కులు లేవని, కుటుంబ పరిమితుల్లోనే వారి పాత్రను పరిమితం చేసినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల లోక్‌సభలో ఆమోదం పొందిన 2023 మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో ఆలస్యం జరుగుతుందని, 2034 వరకు అమలు అయ్యే అవకాశం లేదని ఆయన తెలిపారు. అలాగే డిలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఈ అంశంపై గట్టిగా స్పందించడం లేదని రవిశంకర్ ప్రశ్నించగా, చెన్నైలో డిలిమిటేషన్ వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ హాజరై మద్దతు తెలిపారని డోలేంద్ర ప్రసాద్ వివరించారు.

కేంద్ర రాజకీయాలపై మాట్లాడిన ఆయన, ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొకున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ప్రధాని మోదీ ముందు ఒత్తిడికి లోనవుతున్నారని వ్యాఖ్యానించారు.

మహిళలకు రాజకీయ ప్రతినిధ్యం పెరిగితే వారి జీవితాల్లో మార్పు వస్తుందా అనే ప్రశ్నను రవిశంకర్ ముందుకు తెచ్చారు. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.