TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశం కార్యకర్తల పార్టీ.. మహానాడు వేదికగా మరోసారి తిరుగులేని రుజువు

Published on: Sun May 29, 2022 9:17AM

ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీని నడిపించింది..ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నది కార్యకర్తలే. మహానాడు వేదికగా ఆ విషయం మరోసారి రుజువైంది. 2019 ఎన్నికలలో దారుణ పరాజయం తరువాత మూడేళ్లలోనే మళ్లీ అద్భుతంగా తెలుగుదేశం పుంజుకోవడానికి కారణం తెలుగు తమ్ముళ్లే. 2019లో జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వేధింపులు, దాడులు, ఆర్థిక మూలాలను దెబ్బతీసే చర్యలతో పెట్రేగిపోయారు. స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేనంతగా వైసీపీ అరాచకాలు శృతి మించాయి.

నేతలు అడుగు బయటపెట్టడానికి కూడా జంకే పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొందరైతే జావగారిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. అయితే కార్యకర్తలు మాత్రం బెదరలేదు. భయపడలేదు. మడమ తిప్పలేదు. ఎక్కడికక్కడ వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారు.   వైసీపీ దాడులకు గుండెలడ్డేసి నిలబడ్డారు. ఫలితం.. ప్రజలలోనూ వైసీపీ అరాచకాలను నిలదీసి ప్రశ్నించే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంతులు, ఎమ్మెల్యేలను నిలదీసి ప్రశ్నించేలా చేసింది.

నిరసన సెగలను తట్టుకోలేక వారు ‘గడపగడపకూ’ మొహం చాటేశారు. అంతెందుకు ముఖ్యమంత్రి జగన్ సభనే జనం బాయ్ కాట్ చేసే ధైర్యం ప్రజలకు రావడానికి కారణం తెలుగుదేశం కార్యకర్తల సాహసం, పట్టుదలే. ఇంకానా ఇకపై సహించం అంటూ జనం ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదిరించే దమ్ము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచే వచ్చింది. రైతు భరోసా కార్యక్రమంలో జగన్ ప్రశ్నిస్తుండగానే జనం నిరసన వ్యక్తం చేస్తూ ‘వాకౌట్’ చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా లేక్క చేయలేదు. ఆ ధిక్కారం తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చిన ధైర్యమే. మహానాడు వేదికగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఇదే చెప్పారు. తెలుగుదేశం బలం కార్యకర్తలేనన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి తాము సన్నద్ధంగా ఉన్నామన్న విషయాన్ని లక్షలాదిగా మహానాడుకు తరలి వచ్చి మరీ తెలియజేశారు.  

బస్సులు అందుబాటులో లేవు, పార్టీ పరంగా జనసమీకరణ జరగలేదు.  ఊళ్లకు ఊళ్లు   ట్రాక్టర్లు.. కార్లు, మోటారు సైకిళ్లు, సైకిళ్లు ఇలా ఏది దొరికితే అది పట్టుకుని స్వచ్ఛందంగా తరలి వచ్చారు.  మహానాడుకు ఈ స్థాయిలో జనం తరలి వస్తారని పార్టీ వర్గాలు కూడా ఊహించలేదు. జరుగుతుందని టీడీపీ వర్గాలు కూడా ఊహించలేదు.  సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ  ఐక్యమౌతున్నారు.

నాయకుల పిలుపు కోసం చూడకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వ విధానాలను అడ్డుకుంటున్నారు. ఆ స్ఫూర్తి మహానాడులో ప్రస్ఫుటమైంది.  నాయకులు పార్టీలు మారినా క్యాడర్ స్థిరంగా తెలుగుదేశంతోనే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ అంటూ  పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు నుంచీ, ప్రస్తత అధినేత చంద్రబాబు వరకూ ఈ నాలుగు దశాబ్దాలుగా ఏదైనా నమ్మారో, ఏదైతే చెబుతూ వచ్చారో అది నూటికి నూరుపాళ్లు నిజమని మహానాడు మరోసారి రుజువు చేసింది.

 మహానాడుకు ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించింది. సభకు వెళ్లిన వారి వివరాలు తెలుసుకుని పథకాలు ఆపేస్తామని బెదరింపులకు దిగింది. మీకు మీ పథకాలకూ ఓ దండం అంటూ వైసీపీ బెదరింపులను ఖాతరు చేయకుండా తరలి వచ్చారు.   జగన్ ముందస్తు యోచన చేస్తుంటే.. మేం రెడీ తెలుగుదేశం క్యాడర్ సమర శంఖం మోగించేసింది.