TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కువైట్ నరకంలో తెలుగు మహిళ.. సురక్షితంగా వెనక్కు తీసుకురావాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు

Published on: Thu May 21, 2026 10:03AM

 కుటుంబానికి అండగా నిలవాలనే తపనతో గల్ఫ్ దేశానికి వెళ్లిన ఒక సామాన్య తెలుగు మహిళకు అక్కడ ఊహించని నరకం ఎదురైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి అనే మహిళ బతుకుదెరువు కోసం ఈ ఏడాది 2026 ఫిబ్రవరిలో కువైట్ దేశానికి వెళ్ళింది. పీలేరుకు చెందిన చిన్నబ్బ అనే లోకల్ రిక్రూట్‌మెంట్ ఏజెంట్   మాటలు నమ్మి, అక్కడ హౌస్ కీపింగ్ లేదా గృహ సహాయకురాలిగా చేరింది. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాతే ఆమె అసలు మోసాన్ని గ్రహించింది. సదరు ఏజెంట్లు ఆమెకు కనీసం చెల్లుబాటయ్యే సరైన ఎంప్లాయ్‌మెంట్ లేదా వర్క్ వీసా  అందించకుండానే కువైట్ పంపించేశారని తెలుస్తోంది. దీంతో ఆమె అక్కడ చట్టపరమైన రక్షణ కూడా లేని తీవ్ర దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయింది.

కువైట్ చేరిన కొద్దిరోజులకే భాగ్యవతిపై యజమానుల వేధింపులు మితిమీరిపోయాయి. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన నరకయాతన అనుభవించిన ఆమె..  ఇక అక్కడి బాధలను తట్టుకోలేక  తనను తిరిగి ఇండియాకు పంపించవలసిందిగా యజమానులను, ఏజెంట్లను బతిమాలినా ఫలితం లేకపోగా.. వేధింపులు మరింత ఎక్కవయ్యాయి.  తనను ఇండియాకు పంపించాలంటే ఏజెంట్‌కు ఇచ్చిన భారీ మొత్తాన్ని తిరిగి కట్టాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఈ దారుణ పరిస్థితుల్లో   దిక్కుతోచని స్థితిలో  భాగ్యవతి..  ఎలాగైనా సరే ఆ నరకం నుండి బయటపడాలనే ఆశతో ఒక ఆవేదనాభరితమైన సెల్ఫీ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గార్లను ఉద్దేశించి  నన్ను ఎలాగైనా కాపాడండి.. ఈ నరకం నుండి నన్ను బయటకు తీసుకురండి అంటూ కన్నీళ్లతో వేడుకుంది.

ఈ  సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా.. మీడియా కథనాల ద్వారా నేరుగా సీఎం కార్యాలయం దృష్టికి వెళ్ళింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా  స్పందించారు.  వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. భాగ్యవతిని వీలైనంత త్వరగా, సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు  అత్యవసర చర్యలు చేపట్టాలని  అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ ,  కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో  అత్యవసరంగా సంప్రదింపులు జరిపింది. బాధితురాలి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆమెను వేగంగా ఇండియాకు రప్పించేందుకు  దౌత్యపరమైన ఏర్పాట్లను వేగవంతం చేశారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, చంద్రగిరి పోలీసులు  తొండవాడలోని భాగ్యవతి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి మాట్లాడారు. తమ ఆడబిడ్డ సురక్షితంగా తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరపున పూర్తి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోంది.