TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయ్‌ ఆవేదనని మిస్టరీగా మిగులుస్తారా..?

Published on: Wed Dec 13, 2017 12:14PM

 

కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్య తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. బిజీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న విజయ్ బలవన్మరణం వెనుక కారణమేంటీ..? ఆర్థిక ఇబ్బందులా.. కుటుంబ కలహాలా..? మరేదైనా చెప్పుకోలేని బాధా..? అవకాశాలు రాకపోవడం అనే అంశం చుట్టూ ఇలాంటి సందర్భాల్లో చర్చ జరుగుతుంది.. కానీ అది ఓ కారణమే తప్ప.. అదే అసలు కారణం కాదన్నది మెజార్టీ సినీ ప్రముఖుల వాదన. కుటుంబ సమస్యలు, ఇతరత్రా కారణాలూ సినీ నటుల ఆత్మహత్యలకు కారణమని ఎన్నో సార్లు రుజువైంది. అందుకు తగినట్లుగానే చనిపోవాలని నిర్ణయించుకున్నాకా విజయ్ సెల్పీ వీడియో తీసుకుని.. భార్య కారణంగా అనుభవించిన మానసిక క్షోభను బయటపెట్టాడు.

 

వనితతోపాటు ఆమె తల్లి వ్యభిచారం చేస్తున్నారని.. తన కూతురు అలాంటి వాతావరణంలో పెరగడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. తాను చనిపోయాక, తన భార్యపైనా ఆమెతోపాటు తనను వేధించిన శశిధర్, లాయర్ శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఎవర్నీ వదిలిపెట్టకూడదని తండ్రికి చెబుతూ వీడియో ముగించాడట. అయితే ఈ వ్యాఖ్యలను వనితారెడ్డి ఖండిస్తూ.. విజయ్‌సాయి క్యారెక్టర్‌పై ఆరోపణలు చేసింది. విజయ్‌కి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని.. పద్ధతి మార్చుకోమని చెప్పినందుకు ఎన్నో సార్లు తనను కొట్టాడని ఆరోపించింది. ఈ సంగతి పక్కనబెడితే విజయ్ ఆరోపించిన ముగ్గురు వ్యక్తుల్లో ప్రముఖమైన పేరు శశిధర్.. ఎవరన్న దానిపై కూపీ లాగగా..

 

అతను నవయుగ కనస్ట్రక్షన్స్ అధినేత విశ్వేశ్వరరావు కుమారుడిగా తేలింది. కంపెనీ వ్యవహారాలన్నీ ఇతడే చూస్తుంటాడట.. లాబీయింగ్‌లు, పైరవీలు నడపడంలోనూ దిట్టగా చెబుతున్నారు పారిశ్రామిక వర్గాలు. సెల్ఫీ వీడియోలో తన భార్యతో శశిధర్‌కి గల సంబంధంపై విజయ్ వివరంగా చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. ఇతని పేరు సెల్ఫీ వీడియోలో ఉండటంతో నవయుగ రంగంలోకి దిగిందట. ఉదయం ఘటన జరిగితే ఆ రోజు సాయంత్రం వరకు ఈ విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులపై ఒత్తిడి వచ్చిందట. కానీ, మీడియా సమావేశంలో డీసీసీ, శశిధర్ పేరును బయటకు వెల్లడించారు. అయితే అతను నవయుగ ఛైర్మన్ కుమారుడు కాదని.. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగి అని చెప్పారు.

ఏడాదికి 20 వేల కోట్ల టర్నోవర్ కలిగి.. అంతర్జాతీయ స్థాయి కాంట్రాక్టులతో.. దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నవయుగను నడుపుతున్న వ్యక్తికి.. సాదా సీదా సినీ నటితో అవసరం ఏంటి అనే సందేహం మీకు రావొచ్చు. దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. శశిధర్ సహజంగానే విలాస పురుషుడు.. తన మిత్రులతో కలిసి అప్పుడప్పుడూ కృష్ణపట్నం పోర్ట్‌కు వెళ్లేవాడని.. ఆ సమయంలో తనకు నచ్చిన మందు, మగువలతో పోర్ట్‌లో ఉన్న ఒక దీవిలో జల్సా చేస్తాడని పారిశ్రామిక వర్గాల్లో టాక్ ఉంది. అలాగే పారిశ్రామిక వ్యవహారాలు చక్కబెట్టడం అంత సులువు కాదు. సామ, ధాన, బేధ దండోపాయాలను ఉపయోగిస్తే కానీ పనులు జరగవు. అలాంటి వాటిల్లో అమ్మాయిలు కూడా ఒక భాగం.

 

తన వ్యాపార అవసరాల కోసం శశిధర్ తదితరులు వనితను ఉపయోగించుకున్నారని విజయ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. మరోవైపు చట్టం ధనవంతులకి చుట్టం అన్న నానుడి ఎప్పటి నుంచో ఉంది. డబ్బున్నవాళ్లు దేని నుంచైనా బయటపడగలరు.. ఈ దేశంలో పేదలకు న్యాయం లభించటం చాలా కష్టం.. పరపతి ఉన్నవాళ్లను శిక్షించటం కూడా చాలా కష్టమనే భావన ఉంది. బాలకృష్ణ కాల్పుల వ్యవహారం, సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్, కృష్ణ జింకల వేట కేసులతో పాటు.. ఎందరో బడా బాబులు, ఎన్నో కేసుల నుంచి తప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ పరిణామాలు ఘనత వహించిన న్యాయ వ్యవస్థ ముందు లక్షలకొద్ది ప్రశ్నలుంచాయి. తాజాగా కమెడియన్ విజయసాయి ఆత్మహత్యలోనూ డబ్బు, పరపతి కీలకపాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. అతని మరణం మిస్టరీగా మారిపోతుందా..? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. మరి విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాల్సిందే.