TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తిన‌లో తెలంగాణ లొల్లి...

Published on: Fri Mar 25, 2022 11:12AM

తెలంగాణ రాజకీయాలకు ఢిల్లీ వేదిక అయింది. ఓ వంక వేసంగి వరి పై తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ చేరిన తెరాస మంత్రుల బృందం కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌’తో సమావేశమయ్యారు. మంత్రుల బృందం ఢిల్లీ వెళ్ళక ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్’లో  విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే, తెరాస మంత్రుల బృందం కేంద్ర మత్రి దృష్టికి తీసుకెళ్ళింది. హైదరాబాద్’లో ముఖ్యమంత్రి చేసిన డిమాండ్’నే ఢిల్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేశారు. పంజాబ్’లో కొన్నట్లే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. బియ్యం కాదు, ధాన్యమే కొనాలని ఘట్టిగా డిమాండ్ చేశారు. 

కేంద్ర మంత్రి తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందాన్నికలవక ముందే మీడియా ముందుకు వచ్చి, తెరాస ప్రభుత్వం, ‘రైతు వ్యతిరేక’ ప్రభుత్వమని విరుచుపడ్డారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని కొంచెం చాలా ఘాటైన విమర్శలే చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్’సీఐ) వేసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఫిబ్రవరిలోనే అన్ని రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకుందని, ఒక్క తెలంగాణ ప్రభుతం మాత్రమే ఆ సమావేశానికి హాజరు కాలేదని, కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఎఫ్’సీఐ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్’లో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పాల్గొనలేదు? ఎందుకు ఒప్పందం చేసుకోలేదు? రాజకీయ రచ్చ చేసేందుకే ఎఫ్’సీఐతో ఒప్పందం చేసుకోలేదా? మీ రాజకీయ ప్రయోజనాలకోసం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తారా? అని మంత్రుల ముందరి కాళ్ళకు కేంద్ర మంత్రి బంధాలేశారు. ఎంత ముడి ధాన్యం ఇస్తారో తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు చెప్పలేదని అన్నారు. పంజాబ్ నుంచి అయినా రాష్ట్రం నుంచి అయినా కేంద్రం బియ్యమే కొంటుందని వడ్లు కొనదని గోయల్ స్పష్టం చేశారు.

అంతే కాదు,ఈ సందర్భంగా ఇందుకు సంబంధించి విధానపరమైన సవరణ చేయాలని తెరాస బృందం సూచనను కేంద్ర మంత్రి తిరస్కరించడమే కాకుండా,’మీరు కేంద్రలో అధికారంలోకి  వచ్చినప్పుడు సవరణలు చేసుకోండని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దేదించుతామని గతంలో  కేసీఆర్’ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్’గా చురకలు అంటించారు. కేంద్ర మంత్రిని కలిసి వచ్చిన తర్వాత కేందమంత్రిపై  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి షరా మాములుగా తెరాస భాషలో తిట్టిపోశారు.  కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని, ధాన్యం కొనుగోలు చేయాలని అడిగితే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చాలా హేళనగా, బాధ్యత లేకుండా మాట్లాడారని దుయ్యబట్టారు. పీయూ్‌షతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజానాలు పట్టవని  మరోసారి రుజువైందని అన్నారు. ఇది తెలంగాణ రైతాంగాన్ని అవమానపర్చడమే వ్యాఖ్యానించారు. 

అయితే చివరకు ఏమి తేలిందంటే, సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి. నిజానికి, ఇంతకు మించి ఏదో జరుగుతుందని, ఎవరూ ఉహించింది లేదు.సో ..ఎప్పటిలానే, తెరాస మంత్రుల ఢిల్లీ యాత్ర ముగిసింది. ఢిల్లీలో విమానమెక్కి హైదరాబాద్’లో దిగిపోయారు.పనిలో పనిగా, ఈ రెండు రోజుల్లో సందట్లో సడేమియా అన్నట్లు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్’ ధరలతో పాటుగా తో వంట గ్యాస్ మంటను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండ విద్యుత్ చార్జీల వడ్డించింది.
  
అంతే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నాయకులు కూడా ఢిల్లీ కేంద్రంగానే వరి రాజకీయం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్’కు రాసిన లేఖలో బండి, రైతుల ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే ధాన్యం కొనుగోలు చేయాలని, చేతకాకుంటే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల తరఫున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ధాన్యం విషయంలో కేసీఆర్‌వి మొదటి నుంచీ కుప్పిగంతులేనని బండి ఎద్దేవ చేశారు. పంజాబ్‌ సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం బియ్యం సేకరిస్తున్నదే తప్ప ధాన్యం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రలో అధికారంలో ఉన్న తెరాస, బీజేపీ ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలను రక్తి కట్టిస్తుంటే, అక్కడా, ఇక్కడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయం కూడా ఢిల్లీ చేరుకుంది. పార్టీలో అంతర్గతంగా సాగుతున్నఅసమ్మతిని చల్లార్చేందుకు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నడుం బిగించింది. ఈనేపధ్యంలో రాష్ట్ర నాయకులు ఢిల్లీ క్యూ కడుతున్నారు.