కోదండరాం అరెస్ట్

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో నిరుద్యోగ ర్యాలీకి జేఏసీ పిలుపునివ్వడంతో శాంతిభద్రతల దృష్ట్యా కోదండరామ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోదండరామ్‌తో పాటు పలువురు జేఏసీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తాము నిరుద్యోగ ర్యాలీని ఓయూలో నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలంటూ జేఏసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం నాగోల్‌లో నిర్వహించుకునేందుకు అనుమతినివ్వబోగా జేఏసీ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. పలు విద్యార్థి సంఘాలు ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించడంతో అప్రమత్తమైన పోలీసులు నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.