TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ, జనసేన మధ్య నో అలియెన్స్.. కానీ పవన్ ప్రచారం మాత్రం కమలం అభ్యర్థులకే!

Published on: Wed Feb 4, 2026 9:10AM

తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్నితెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు స్వయంగా ప్రకటించారు. అంతకు ముందు మంగళవారం (ఫిబ్రవరి 3) రాత్రి వీరిరువురూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఆ భేటీ తరువాత బీజేపీ నుంచి జనసేన మద్దతు, పవన్ కల్యాణ్ ప్రచారం ప్రకటన వెలువడింది. 

వాస్తవానికి జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో  బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది. 

ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పొత్తుల గురించి బీజేపీ ఎలాంటి చొరవ తీసుకోలేదు సరికదా, తెలంగాణ మునిసిపోల్స్ లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేసిన తరువాత పవన్  కల్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారన్న బీజేపీ ప్రకటన తెలంగాణలో జనసేన ఉనికినే ప్రశ్నార్థకం చేసినట్లైంది.   సొంత పార్టీ నేతలు బరిలో ఉండగా వారిని కాదని పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి రావడమేంటన్న విస్మయం రాజకీయ పరిశీలకుల్లో కూడా వ్యక్తం అవుతోంది.  

అదలా ఉంటే పవన్ కల్యాణ్ ప్రచారం విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది కానీ ఈ విషయంపై పవన్ కల్యాణ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలోనే జనసేన క్యాడర్ పవన్ కషాయ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారన్నబీజేపీ ఏకపక్ష ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సరే తెలంగాణలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు లేదు. అయినా పవన్ కల్యాణ్ బీజేపీ తరఫున తెలంగాణ మునిసిపోల్స్ లో ప్రచారం చేస్తే.. బరిలో ఉన్న జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్న గందరగోళం నెలకొంది.