కోదండరాం కు కష్టకాలం
Published on: Tue May 1, 2012 10:12AM
తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రస్తుతం గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కె.చంద్రశేఖరరావు టి.ఆర్.ఎస్. పార్టీ ఏర్పాటు చేయటానికి చాలా ముందుకాలం నుంచే ప్రొఫెసర్ కోదండరామ్ ఆంధ్రులపై విషం కక్కుతూ పలు పుస్తకాలు రాశారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఒకవైపు అద్యాపకుడిగా ప్రభుత్వ జీతం తీసుకుంటూనే మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర సమైఖ్యతకు భంగం కలిగించేలా ఉద్యమాలు చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ తీరును మెచ్చుకున్న కేసిఆర్ ఆయన్ను తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించారు. చాలాకాలం పాటు కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ ఒకేమాట, ఒకేబాటగా మెలిగారు. కొన్ని సందర్భాలలో కోదండరామ్ చెప్పినట్లే తెలంగాణా నాయకులూ, విద్యార్థులూ నడుచుకున్నారు. కోదండరామ్ ఒక పవర్ సెంటర్ గా మారటంతో కేసిఆర్ వైఖరిలో మార్పు వచ్చింది.
గత ఏడాది జెఎసి చేపట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. అనంతరం కొద్దికాలం క్రితం జరిగిన పాలమూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో జెఎసి వైఖరి కెసీఆర్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది., ఈ ఎన్నికల్లో జెఎసి తెలంగాణారాష్ట్ర సమితి అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వటం, బిజెపి అభ్యర్థి గెలుపొండటంతో కెసీఆర్ తోకతొక్కిన తాచులా పైకి లేచారు. కోదండరామ్ పై పగబట్టారు. కోదండరామ్ వల్ల తెలంగాణా ఉద్యమం బలహీనపడుతోందని ఆరోపించారు. అసలు జెఎసిని ఏర్పాటు చేసింది తానే అని కానీ, కోదండరామ్ తనను ధిక్కరిస్తూ మాట్లాడుతున్నారని కెసీఆర్ అంటున్నారు. తామే లేకపోతే జెఎసి ఎక్కడిదని ప్రశిస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన జరిగిన పార్టీ 11వ వార్షికోత్సవ ప్రతినిధుల సభలో కోదండరామ్ ని అవమానించారు. గతంలో జరిగిన ప్రతినిధుల సభలో కోదండరామ్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తిన కేసీఆర్ 28వ తేదీ నాటి సభలో ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా జెఎసి చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తప్పించటానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కోదండరామ్ కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.


