ఉండవల్లి ఓ ఊసరవెల్లి
posted on Jul 19, 2013 2:57PM
రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణపై మరోసారి విషం చిమ్ముతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు మండిపడ్డారు. విశాఖ వెనుకబడిందని ఆయన చెబుతున్నారని కానీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో విశాఖ ఉందన్నారు. 1972లోనే విభజన జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందేవన్నారు.
విభజన ద్వారా తెలంగాణే కాకుండా సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణపై విస్తృత చర్చ జరగాలని ఉండవల్లి అంటున్నారని, అరవై ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉందని, ఎప్పుడు చర్చ జరగలేదో చెప్పాలన్నారు. విభజన జరగకపోవడం వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు యాభై ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. ఉండవల్లి అనవసర రాద్ధాంతం చేయవద్దన్నారు.
ఉండవల్లి సమైక్యవాది కాదు, వేర్పాటువాది కాదని, అవకాశవాది అన్నారు. ఒకవేళ విశాఖ అభివృద్ధి చెందలేదంటే అది సీమాంధ్ర నేతల వల్లే అన్నారు. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని మండిపడ్డారు. 1973లో సినీ హీరోలు కృష్ణ, కృష్ణం రాజులు కూడా విభజననే కోరుకున్నారన్నారు.