తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై హైకోర్టు అసంతృప్తి

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను  హైకోర్టు కొట్టివేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరీక్షలు ఎందుకు తక్కువ చేస్తున్నారని ప్రశ్నించింది. లక్షణాలు లేని హైరిస్క్ వ్యక్తులకు ఎందుకు పరీక్షలు చేయడంలేదని ప్రశ్నించింది.  ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చినవారిలో ఎంతమందికి కరోనా పరీక్షలు చేశారో కోర్టుకు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల వివరాలను జూన్ 4 లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండుసార్లు రాసిన లేఖలు, అలాగే కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో, ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో కూడా జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.