TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైడ్రా కమిషనర్ కి తెలంగాణ హైకోర్టు ఫైన్

Published on: Sat Jun 13, 2026 9:25AM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా కు, హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడం ఎంతటి ఉన్నతాధికారికైనా చెల్లదంటూ   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు హైడ్రా కమిషనర్   రంగనాథ్‌కు   50 వేల రూపాయల జరిమానా విధించింది.   జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ శుక్రవారం  వెలువరించిన ఈ తీర్పు  రాష్ట్రవ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఐఏఎస్,  ఐపీఎస్ అధికారుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే న్యాయస్థానాల పరిధిని దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమనే బలమైన సంకేతాన్ని ఈ తీర్పు ద్వారా హైకోర్టు పంపించింది.

ఈ వివాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్‌ నగర పరిధిలోని   ఖైరతాబాద్ మండలం  యూసఫ్‌గూడ  పరిధిలోని  సర్వే నంబర్ 45 లోని  రెండెకరాల భూవివాదం ఉంది. ఈ స్థలానికి సంబంధించి మహ్మద్ షఫాహతుల్లా అనే వ్యక్తి గతంలో న్యాయం కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ దాఖలు చేసిన ఆధారాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. ఆ వివాదాస్పద స్థలంలో యథాతథస్థితిని కొనసాగించాలంటూ గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆ భూమిలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అయితే..  ఈ న్యాయపరమైన ఆదేశాలను   లెక్కచేయకుండా హైడ్రా,  రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం తీవ్ర వివాదానికి దారితీసింది. కోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ, అధికారులు అక్కడ ఉన్న ప్రహరీ గోడను  కూల్చివేసి, ఆపై చుట్టూ కొత్తగా కంచె ఏర్పాటు చేశారని పిటిషనర్  కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఉల్లంఘనలపై విచారణ చేపట్టిన  తెలంగాణ హైకోర్టు..  హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు కోర్టు ఆదేశాలు ఉండగా ఈ కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో  వివరణ ఇస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి హైడ్రా కమిషనర్‌కు గతంలోనే న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ..  నిర్దేశిత సమయంలోగా హైడ్రా యంత్రాంగం కానీ,  కమిషనర్ స్పందించకపోవడం, కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది స్పష్టంగా కోర్టు ధిక్కరనేనని కోర్టు పేర్కొంది.

 స్టేటస్ కో ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ.. హైడ్రా కమిషనర్  రంగనాథ్‌కు 50 వేల రూపాయలు జరిమానా విధిస్తూ.. ఈ జరిమానా మొత్తాన్ని  చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కు  తక్షణమే చెల్లించాలని ఆదేశించింది.  సదరు   50 వేల రూపాయల జరిమానా రశీదును సమర్పించిన తర్వాతే, ఈ కేసుకు సంబంధించిన హైడ్రా కౌంటర్ అఫిడవిట్‌ను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీని   ఆదేశించింది.