TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Published on: Sun Jun 14, 2026 1:04PM

 

 నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో  వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ సహా పొరుగున ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ ఆరు జిల్లాలకు వాతావరణ కేంద్రం అత్యవసరంగా 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఊహించని రీతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఏపీలోను నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం (జూన్ 14, 2026) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా భారీ హోర్డింగుల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ఏయే జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటే?

ఆదివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. హాలహర్వి వద్ద నడిమివంక, హత్తిబెళగల్ సమీపంలో కళ్లెవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కర్నూలు, బళ్లారి, గుంతకల్లు, ఆలూరు రహదారుల్లో రవాణా పూర్తిగా స్తంభించింది.

గడచిన కొద్ది రోజులుగా కురుస్తున్న ముందస్తు వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సహా ఆయా జిల్లాల యంత్రాంగాలు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాయి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి క్లియర్ చేసేందుకు ప్రత్యేక విపత్తు సహాయక బృందాలను రంగంలోకి దించాయి.

ఈ ఆకస్మిక వాతావరణ మార్పులపై సామాన్య ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ నిలిచిపోకుండా సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ విభాగాలు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమయ్యాయి.

ప్రభుత్వ ఉన్నతాధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉన్నందున వీలైనంత వరకు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.

రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, కంట్రోల్ రూమ్‌లను నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల సమాచారాన్ని ఫాలో అవుతూ సురక్షితంగా ఉండాలని వాతావరణ నిపుణులు కోరుతున్నారు.