కామన్వెల్త్ విజేతలకు టీ సర్కార్ నజరానాలు....

 

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ఆధ్వర్యంలో కశ్యప్, గుత్తా జ్వాలతోపాటు పలువురు క్రీడాకారులు బుధవారం సచివాలయంలో కేసీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా విజేతలను కేసీఆర్ అభినందించారు. క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. అలాగే కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది. స్వర్ణం సాధించిన వారికి రూ. 50 లక్షలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెండిపతకం గెలుపొందిన వారికి రూ. 25 లక్షలు, కాంస్యం సాధించిన విజేతలకు రూ. 20 లక్షలు ఇస్తామని ఆయన ప్రకటించారు. విజేతల కోచ్‌లకు కూడా రూ. 50 లక్షలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ రూ. 3 లక్షలు నజరాన ప్రకటించారు. ఈ ప్రోత్సాహక బహుమతులను గోల్కొండ వేదికగా జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ఇవ్వనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.