ఎంసెట్ కౌన్సిలింగ్‌కి టీ స్టూడెంట్స్ వెళ్ళొద్దు: మంత్రి

 

ఉన్నత విద్యామండలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆగస్టు 7వ తేదీ నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ కౌన్సిలింగ్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులెవరూ పాల్గొనాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కౌన్సిలింగ్‌కి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క విద్యార్థి కూడా హాజరు కానవసరం లేదని, తెలంగాణలోని కాలేజీలు కూడా కౌన్సిలింగ్‌లో పాల్గొనకూడదని మంత్రి ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఇచ్చిన నోటిఫికేషన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. మన రాష్ట్ర కౌన్సిలింగ్ మనమే చేసుకుందామని ఆయన అన్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయం ఏకపక్షమని మంత్రి తప్పు పట్టారు. తెలంగాణ విద్యార్థులకు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించడం తమ ప్రభుత్వ బాధ్యత అని, తమ రాష్ట్రంలోని కాలేజీల్లో నియామకాలు చేసే అధికారం ఆంధ్రప్రదేశ్‌కు లేదని మంత్రి స్పష్టం చేశారు.