తమిళనాడు విద్యావిధానమే తెలంగాణకు ప్రేరణ.. రేవంత్
Published on: Fri Sep 26, 2025 10:02AM

దక్షిణాది రాష్ట్రాల విద్యావిధానాలకు తమిళనాడే ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అతి త్వరలో తమిళనాడులోలా పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని అములు చేస్తామని చెప్పారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం (సెప్టెంబర్ 25) జరిగిన మహా విద్యా చైతన్య ఉత్సవ్కు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన దేశ చరిత్రలో తమిళనాడుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. అన్నాదురై, కామరాజ్ నాడార్, కరుణానిధి వంటి యోధులకు జన్మస్థలమైన తమిళనాడు రాష్ట్రం మాకు అదర్శమన్నారు. కరుణానిధి విజన్ను స్టాలిన్, ఉదయనిధిలు అనుసరిస్తున్నారన్నారు. ఇందిరా గాంధీ కామరాజ్ ప్లాన్ అమలు చేశారన్నారు. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్నే దేశం అనుసరిస్తున్నదన్న రేవంత్ రెడ్డి తమిళనాడు పేదలకు సీఎం స్టాలిన్ అండగా ఉన్నారని ప్రశంసించారు.
ఇక సామాజిక న్యాయం అమలులో తెలంగాణ, తమిళనాడుల మధ్య సారూప్యతలు న్నాయన్నారు. మాజీ సీఎం కరుణానిథిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం ఇలా మొత్తం 69 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.


