ఛానళ్ళ నిషేధంపై గవర్నర్ స్పందన ఏది?: బొత్స
posted on Sep 10, 2014 5:55PM
తెలంగాణ గడ్డపై వుండాలంటే తెలంగాణకు సెల్యూట్ చేయాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎవరికీ తెలంగాణలో ఒకరికి సెల్యూట్ చేసి బతకాల్సిన అవసరం లేదని, దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే హక్కును రాజ్యాంగం కల్పించిందని బొత్స అన్నారు. హైదరాబాద్ శాంతి భద్రతల అంశం గవర్నర్ పరిధిలో వుందని, ఈ నేపథ్యంలో ఛానళ్ళ మీద నిషేధం విషయంలో గవర్నర్ స్పందించాలని ఆయన కోరారు. ప్రజలు ఎవరికైనా సాల్యూట్ చేయవలసి వస్తే, గాంధీ, అంబేద్కర్ లాంటి మహానుభావులకే సెల్యూట్ చేయాలని, ఎందుకంటే వారివల్లే దేశంలో ప్రతి ఒక్కరు ఈనాడు స్వేచ్ఛగా జీవిస్తున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.