TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూడ్రోజుల ముందే టీ-అసెంబ్లీ ముగింపు

Published on: Tue Oct 6, 2015 5:51PM

ప్రతిపక్షాలు లేని సభ ఎలా ఉంటుందో చూడాలంటే తెలంగాణ అసెంబ్లీని చూస్తే సరిపోతుంది, మిత్రపక్షం ఎంఐఎం మినహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, వామపక్ష ఎమ్మెల్యేలందర్నీ సస్సెండ్ చేయడంతో సభలో టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు మినహా ఎవరూ కనిపించలేదు, దాంతో ప్రశ్నోత్తరాల్లో అధికార పార్టీ సభ్యులే ప్రశ్నలడిగి, వాళ్లే సమాధానాలు చెప్పుకున్నారు, వ్యాట్ సవరణ బిల్లు, వాటర్ గ్రిడ్ పై లఘు చర్చలు జరిగినా ప్రతిపక్షాలు లేకపోవడంతో సభ చప్పగా సాగింది.

రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంతో ఇక సభలో మాట్లాడే అవకాశం లేదని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రజాబాట పట్టాయి, దాంతో సభలో టీఆర్ఎస్, ఎంఐఎం మాత్రమే మిగలడంతో ఆ వెలితి స్పష్టంగా కనిపించింది, చాలామంది ఎమ్మెల్యేలు సభలో కూర్చోలేక...లాబీల్లో తిరుగుతూ కనిపించారు, అయినా ప్రతిపక్షాలు లేకుండా ఏం చర్చించుకుంటామంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.

అయితే ప్రతిపక్షాలను సమావేశాలు జరిగినన్ని రోజులూ సస్పెండ్ చేయడంతో... సభను ముందే ముగించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది, బీఏసీ నిర్ణయం మేరకు ఈనెల పదో తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నా... విపక్షాలు లేకపోవడంతో ఏడో తేదీ సాయంత్రానికే సభను సమాప్తంచేసే ఆలోచనలో ప్రభుత్వముందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.