బహిరంగ ఓటింగ్ విధానంతో తెరాసకు కొత్త చిక్కులు
Published on: Sat May 30, 2015 8:24PM
.jpg)
జూన్ 1వ తేదీన యం.యల్యేల కోటాలో జరుగబోయే తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెరాస 5వ అభ్యర్ధిని నిలబెట్టడంతో ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఊహించినట్లే ప్రతిపక్ష పార్టీల యం.యల్యేల పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. ఈరోజు తెదేపా కూకట్ పల్లి యం.యల్యే. మాధవరం కృష్ణా రావు తెరాసలోకి ఫిరాయించారు. కానీ తెరాస ఇతర పార్టీల యం.యల్యేలను ఫిరాయింపులకి ప్రోత్సహించి వారిని పార్టీలో చేర్చుకొన్నప్పటికీ, ఈసారి మండలి ఎన్నికలు రహస్య బ్యాలట్ ద్వారా కాకుండా బహిరంగ ఓటింగ్ పద్దతిలోనే నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించడంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన 5వ అభ్యర్ధిని గెలిపించుకోవడం తెరాసకు పెద్ద సవాలుగా మారింది. ఈ పద్దతిలో ఏ పార్టీకి చెందిన యం.యల్యే. ఎవరికి ఓటేసారనే విషయం అక్కడే తెలిసిపోతుంది కనుక ఒకవేళ ఎవరయినా యం.యల్యే. క్రాస్ ఓటింగ్ చేసినట్లయితే పార్టీ విప్ ను దిక్కరించినందుకు అతను/ఆమెపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. మరి ఈ సమస్యను తెరాస ఏవిధంగా అదిగమిస్తుందో తెలుసుకోవాలంటే జూన్ 1వరకు ఆగాల్సిందే!


