శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన పెను ముప్పు !
posted on Jul 23, 2019 12:36PM
శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు ఇండిగో విమానానికి భారీ ముప్పు తప్పింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రన్ వేపై వెళ్తుండగా విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం ఆగిపోయింది. పైలెట్ దీనిని గుర్తించి అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ ఘటన సంభవించిన సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా విమనంలోని ప్రయాణికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.
లోపాన్ని తర్వాత సరి చేసినా ఎందుకయినా మంచిదని రెండు గంటల అనంతరం ప్రయాణికులను వేరే విమానంలో గమ్యస్థానానికి చేర్చారు. నిజానికి ఈ సాంకేతిక లోపం విమానం గాలిలో ఉన్నప్పుడు ఈ లోపం తలెత్తితే పెను ప్రమాదం చోటు చేసుకునేదని అంటున్నారు. అయితే ఇండిగో సిబ్బంది మాత్రం ఇది చాలా సర్వసాధారణమైన సమస్య అని చెప్పడం గమనార్హం. రన్వేపై ముందుకు కదులుతున్నప్పుడు గుర్తించడంలో పెను ప్రమాదం తప్పింది. నింగిలో ఉన్నప్పుడు జరిగి ఉంటే 156 మంది ప్రాణాలు గాల్లో కలిసేవని చెబుతున్నారు.