TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కంగారూలను కంగారెత్తించిన టీమ్ ఇండియా

Published on: Mon Nov 25, 2024 12:30PM

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను టీమ్ ఇండియా సజీవంగా నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ లో 295 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది.  ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఇంత దారుణంగా ఓడించిన జట్లు టీమ్ ఇండియా తప్ప మరొటి లేదేమో. 
గవాస్కర్ -బోర్డర్ ట్రోపీలో భాగంగా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగు రోజులకే ముగిసింది. ఈ టెస్టులో అన్ని విభాగాల్లోనూ టీమ్ ఇండియా ఆసీస్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగుల స్వల్ప స్కోరుకే ఔటయ్యింది. అయితే కెప్టెన్ బుమ్రా అద్భుత బౌలింగ్, సిరాజ్, రాణాల మంచి స్పెల్ తో ఆస్ట్రేలియా కుప్పకూలింది. కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో తొలి రోజే 17 వికెట్లు పతనమయ్యాయి. తొలి రోజు పేస్ కు బ్రహ్మాండంగా సహకరించిన పిచ్ ఆ తరువాత బ్యాటింగ్ కు స్వర్గధామంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యత సాధించిన టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఓపెనర్లు రాహుల్, యశశ్విజైస్వాల్ లు ఆసీస్ బౌలింగ్ అటాక్ ను ఓ ఆటాడుకున్నారు. 201 పరుగుల ఓపెనింగ్  పార్ట్ నగర్ షిప్ తో మ్యాచ్ ను ఆస్ట్రేలియా నుంచి లాగేసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ మాత్రం తన ఫామ్ ను కొనసాగిస్తూ 161 పరుగులు సాధించారు. ఇక చాలా కాలంగా సెంచరీ కోసం మొహం వాచి ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన విశ్వరూపం చూపాడు. అలవోకగా ఆడుతూ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 30వ సెంచరీ కాగా.. మొత్తంగా అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 81వది. 

దీంతో టీమ్ ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాకు 533 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఆదిలోనే టీమ్ ఇండియా బౌలర్లు చావు దెబ్బ కొట్టారు. మూడో రోజు టీ విరామ సమయం తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి కేవలం 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయింది. నాలుగో రోజు ఆట ఆరంభమైన తరవాత కూడా ఆసీస్ వికెట్ల పతనం కొనసాగింది. అయితు ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్ లు వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో హెడ్ 89 పరుగులు, మార్ష్  47 పరుగులు చేశారు. ఆ తరువాత కేరీ కొద్ది సేపు క్రీజ్ లో నిలబడినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 239 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 295 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.