TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెమీస్‌కు తుది జట్టు కూర్పే టీమ్ ఇండియాకు సవాల్

Published on: Mon Mar 3, 2025 5:48PM

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఢీ  ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాను టీమ్‌ఇండియా మంగళవార ఢీ కొట్టనుంది. జట్టులోని ప్రతి బౌలరూ రాణించడం మేనేజ్‌మెంట్‌ను, అభిమానుల్ని సంతోషరుస్తున్నా, సెమీస్‌కు తుది పదకొండు మంది జట్టు ఎంపిక  టీమ్ మేనేజ్‌మెంటుకి సవాల్‌గా మారింది. భారత్‌కు బ్యాటింగ్‌ విషయంలో ఇప్పటి వరకు సమస్యల్లేవు. టాప్‌ ఆర్డర్, మిడిలార్డర్‌ నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది.

గత మూడు మ్యాచుల్లో పెద్దగా మార్పుల్లేకుండానే బ్యాటింగ్‌ విభాగం బరిలోకి దిగింది. కానీ, ఆసీస్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్‌ కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టి.. రిషభ్ పంత్‌కు అవకాశం ఇస్తారనే వార్తలు చక్క ర్లు కొడుతున్నాయి. ఆసీస్‌పై పంత్‌కు మంచి రికార్డు ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. కివీస్‌తో మ్యాచ్‌లో స్పిన్‌ బౌలింగ్‌ సమయంలో వికెట్‌ కీపింగ్‌ చేసేందుకు కేఎల్ కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించాడు. మొదట్లో కేన్‌ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ జారవిడిచాడు. ఒకవేళ దానిని పట్టుంటే కివీస్‌పై ఇంకాస్త ముందుగానే భారత్‌ విజయం సాధించే అవకాశం ఉండేది. మిగతా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చే అవకాశం ఉండదు.  తొలి రెండు మ్యాచుల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన భారత్.. అనూహ్యంగా కివీస్‌పై నలుగురిని రంగంలోకి దింపింది. అద్భుతమైన ఫలితం సాధించింది. ఇందులో ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లు కాగా.. ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు. అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం రెండో వన్డే మాత్రమే ఆడిన వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతడిని తప్పించడమనే ఆలోచనే ఉండదు.

మిగతా ముగ్గురిలో మార్పులు చేసే అవకాశం ఉంది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చి.. వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తారని తెలుస్తోంది. ఎడమ చేతివాటం బ్యాటర్‌, కుడిచేతి బౌలర్‌ అయిన సుందర్ ఆసీస్‌పై ఉత్తమ ప్రదర్శన చేస్తాడనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, స్పిన్‌ను ఆడటంలో ఇతర జట్ల కంటే ఆసీస్‌ కాస్త మెరుగైందే. దుబాయ్‌ పిచ్‌ మందకొడిగా ఉండి స్పిన్‌కే సహకరిస్తున్న వేళ మరో ఆలోచన లేకుండా నలుగురుతో బరిలోకి దిగడం ఖాయమే. కివీస్‌తో మ్యాచ్‌లో షమీ మూడు ఓవర్లే వేశాడు. మధ్యలో మోకాలి నొప్పి తలెత్తడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. మరి అతడికి విశ్రాంతి ఇచ్చి అర్ష్‌దీప్‌ లేదా హర్షిత్ రాణాలో ఒకరికి ఛాన్స్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కొత్త బంతితో హార్దిక్‌ పాండ్య నాణ్యమైన పేస్‌ను రాబట్టాడు. అతడు పూర్తిస్థాయి పేసర్‌ మాదిరిగానే స్పెల్స్‌ వేస్తున్నాడు. కివీస్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌ కూడా హార్దిక్‌ తీసిన సంగతి తెలిసిందే. మిగతావన్నీ స్పిన్నర్ల ఖాతాలో పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తుది జట్టు కూర్పు పెద్ద సవాలే అని కెప్టెన్ రోహిత్‌శర్మే అంటుండటం విశేషం.